హీరోయిన్ ఆర్తి అగర్వాల్ మృతి, కారణం ఏమిటి?
హైదరాబాద్: టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ శనివారం మృతి చెందారు. అమెరికాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. లైపో సర్జరీ వికటించడంతోనే ఆమె మరణించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆమె ఊబకాయం, శ్వాసకోస వ్యాధితో బాధ పడుతోంది. ఆర్తి అగర్వాల్ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె అభిమానులు ఈ వార్త విని షాక్ అయ్యారు.

నువ్వునాకు నచ్చావ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ తో సహా పలువురు స్టార్లతో కలిసి నటించారు. ఆమెకు ఉజ్వల్ అనే వ్యక్తితో 2007లో వివాహం జరిగింది. అయితే వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. మళ్లీ సినిమాల్లోకి వచ్చినా అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీ సమీపం అట్లాంటాలో ఉంటున్నారు.
ఇంద్ర, నువు నాకు నచ్చావ్, సంక్రాంతి, అందాల రాముడు, నీస్నేహం, పలనాటి బ్రహ్మనాయుడు, వసంతం, నేనున్నాను, అడవి రాముడు తదితర చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి సినిమా అమ్మ రాజశేఖర్ తో చేసిన ‘రణం-2'.
అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఆర్తి అగర్వాల్ న్యూజెర్సీలో పుట్టి పెరిగింది. 16 యేళ్ల వయసులో 2001 లో విడుదలైన బాలీవుడ్ మూవీ పాగల్పన్ తో ఇండియా సినిమాలలో అడుగుపెట్టింది. వెంకటేస్ సరసన ‘నువ్వు నాకు నచ్చావ్' చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది.
నువ్వు నాకు నచ్చావ్ ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో భారీ అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మరియు నాగార్జున లతో పాటు మహేష్ బాబు, జూ ఎన్టీయార్, తరుణ్ లతో నటించింది. బి.గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది . వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.అవి నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి.


Click it and Unblock the Notifications











