దేశభక్తి, ప్రయోజనాలు.... ఐశ్వర్యరాయ్-రణబీర్ మూవీపై నిషేధం!
హైదరాబాద్: యూరి ఘటన తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, సంగీత దర్శకులు పనిచేసే సినిమాలపై సీవోఈఏఐ ( సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించింది.
దేశభక్తిభావం, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని సీవోఈఏఐ అధ్యక్షుడు నితిన్ దతర్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐశ్వర్యరాయ్, రణబీర్, అనుష్క ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన యే దిల్ హై ముష్కిల్ చిత్రం చిక్కుల్లో పడింది.

'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో పాక్ నటుడు ఫవాద్ఖాన్ నటించాడు. ఈ విషయమై ఉగ్రవాదానికి పాక్ నటీనటులకు సంబంధం లేదని వారిని భారత్ నుంచి వెళ్లగొట్టినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదని కరణ్ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు.
దీపావళికి సినిమా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడటంతో ఏం చేయాలో తోచక దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన భారత్లో ఉంటున్న పాక్ నటీనటులు భారత్ వదిలి వెళ్లిపోవాలని, వారితో కలిసి పనిచేయకూడదని హెచ్చరించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











