తెలుగు చిత్రం రీమేక్ లో అజయ్ దేవగన్...డిటేల్స్
ముంబై: తెలుగు నుంచి హిందీకు మరో చిత్రం వెళ్లటానికి రీమేక్ బండి ఎక్కింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం 'కాంచన'. ఈ సినిమాను తాజాగా హిందీలోకి తీసుకెళ్లబోతున్నారు. దీన్ని షబినా ఖాన్తో కలిసి తుషార్ నిర్మించబోతున్నారు. ఇక్కడ దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్నే హిందీలోనూ దర్శకుడిగా ఎంపిక చేసుకొన్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర పోషించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
తుషార్ చెబుతూ ''ఓ మంచి కథతో ఎవరైనా నన్ను సంప్రదిస్తే... నిర్మాతగా మారదామని చాన్నాళ్లుగా అనుకుంటున్నాను. 'కాంచన' లాంటి హారర్ కామెడీ తరహా కథాంశంతో నిర్మాతను కాబోతుండడం ఆనందంగా ఉంది. నా స్నేహితుడు అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రను పోషించేందుకు ముందుకు రావడం సినిమాకు కలిసొస్తుంది''అని తెలిపారు. ప్రస్తుతం లారెన్స్ 'కాంచన'కు సీక్వెల్గా 'గంగ' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.

శ్రీ గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మల్టీ డైమన్షనల్ అధినేత రజిత్ పార్థసారథి సమర్పణలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 'కాంచన' సినిమా సమయంలోనే తన బ్యానర్ లో ఓ సినిమా చేసిపెడతానని లారెన్స్ తనకి మాట ఇచ్చారనీ, దానిని ఇప్పుడిలా నిలబెట్టుకున్నారని చెప్పారు. 'కాంచన' సినిమా తనకి మంచి లాభాలు తెచ్చి పెట్టిందనీ, అలాగే ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకముందని అన్నారు.
దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ.... ఈ చిత్రం కాంచన తరహాలోనే ఎంటర్టైన్ చేస్తుందని, ఓ వైపు నవ్విస్తూనే... భయపెడుతుందని చెప్పుకొచ్చారు. లారెన్స్, తాప్సీ, బ్రహ్మానందం, శ్రీమాన్, అలీ, కోవై సరళ నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: కృష్ణ స్వామి, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











