కార్తీ చేతుల మీదుగా అల్లరి నరేష్ చిత్రం ప్రారంభం
హైదరాబాద్ : అల్లరి నరేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. స్వాతి దీక్షిత్ హీరోయిన్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా రాజా నిర్మాత. ఈ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ హీరో కార్తి క్లాప్నిచ్చారు. ఎడిటర్ మోహన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అల్లరి నరేష్ తొలి ద్విపాత్రాభినయం ఇది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'కలగలప్పు' చిత్రానికి రీమేక్ ఇది. డుచెన్నైలోని అంబికా ఎంపైర్ హోటల్లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, రిలయన్స్ సంస్థ తరపున సర్కార్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
సమర్పకులు అంబికా కృష్ణ మాట్లాడుతూ ''కలగలుపు అనే తమిళ చిత్రానికి రీమేక్ ఇది. ఈవీవీ సత్యనారాయణతో నాకు మంచి అనుబంధం ఉంది. మా సంస్థకు 'కన్యాదానం'లాంటి సినిమా ఇచ్చారు. ఇప్పుడు నరేష్తో సినిమా చేయడం ఆనందంగా ఉంది''అన్నారు.అంబికా, అంబానీ, అల్లరి నరేష్ అనే మూడు శక్తులతో ఈ సినిమా రూపొందుతోందని వ్యాఖ్యానించారు. ఈవీవీతో తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందనీ, ఆయన కుమారుడు అల్లరి నరేష్ తన కొడుకులాంటివాడేననీ అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ.... ''సీమశాస్త్రిలోని సుబ్రహ్మణ్యశాస్త్రి పాత్ర 'గమ్యం'లో గాలిశీను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది''అన్నారు. తాను పుట్టింది పాలకొల్లులోనే అయినా, పెరిగింది చెన్నైలోనే అని, అటువంటి చెన్నైలో తన సినిమా ఓపెనింగ్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమిళంలో 'కలగలప్పు' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామన్నారు. హీరోగా ద్విపాత్రాభినయం చేయడం సంతోషంగా ఉందని, నాన్నగారి (ఈవీవీ) 'హలోబ్రదర్' తరహాలో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నామని నరేష్ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... '' 'తాతల ఆస్తుల కోసం ఆరాటపడే వారసుల గురించే మనకు తెలుసు. కానీ, మా హీరో తాతల పేరు నిలబెట్టడానికి, వారి వారసత్వాన్ని కాపాడుతాడు. అందుకోసం అతను ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథహలో బ్రదర్ నాగార్జునకు ఎంత పేరు తీసుకొచ్చిందో.. మా సినిమా నరేష్కు అంత పేరు తీసుకొస్తుంది. తొలిసారి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి పాత్ర క్లాస్. మరోటి మాస్. తరతరాలుగా వస్తున్న ఆస్తిని హీరో ఎలా కాపాడుకొన్నాడు అనేదే ఈ చిత్ర కథ. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుంది'' అన్నారు. నవంబరు 4న చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత చెప్పారు. కథ: సుందర్ సి, సంగీతం: విజయ్ ఎబెంజర్, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, అంబికా కృష్ణ అండ్ బ్రదర్స్
సమావేశంలో సీనియర్ నటులు చలపతిరావు, చంద్రమోహన్లు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రం ద్వారా స్వాతి దీక్షిత్ హీరోయిన్గా పరిచయం కాబోతుంది. నవంబర్ 4న షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నారు. విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.


Click it and Unblock the Notifications












