గొడవ శృతిమించుతోంది,కావాలనే చేస్తున్నారు..: నంది అవార్డులని రద్దు చేసే అవకాశం?
నంది అవార్డుల విషయంలో గనక వివాదం ఇలాగే కొనసాగితే అవార్డులను పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం.
Recommended Video

రాష్ట్ర విభజన అనంతరం మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులు ఒక్కసారిగా పరిశ్రమలో కల్లోలం సృష్టించాయి. మూడేళ్ళ విరామంతర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ ఎంపిక చేసిన అవార్డుల వ్యవహారం తీవ్ర విమర్శలకు గురయ్యింది. అనుయాయులకు, తమ కులం వారికి ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు మరింత శ్రుతిమించి అవి నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులని కొందరు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ రెండుగా విడిపో యింది. దీనిపై పెద్దఎత్తున డిబేట్లు కూడా జరిగాయి. ఇక మద్దినేని రమేష్ వర్మ ల మధ్య జరిగిన గొడవలో అయితే ఏకంగా నిజం బూతులనే వాడాడు జ్యూరీ మెంబర్ గా కూడా ఉన్న రమేష్ మద్దినేని...

రాద్దాంతంపై స్పందించింది
ఈ విషయంలో ఇలాగే మౌనం వహిస్తే తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఏపీ ప్రభుత్వానికి కూడా మచ్చ వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు సర్కారు మౌనం వీడింది. అవార్డుల విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై స్పందించింది. ఈ వ్యవహారం మరింత శ్రుతిమించితే ఏకంగా అవార్డులనే రద్దు చేయాలన్న ఆలోచనలో ఉంది.

ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో
కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే ఈ గోల ఏమిటంటూ ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అవార్డులను ఇవ్వడం ఇదే తొలిసారి కాదని, కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్నామని, ప్రతిసారి కొంత రచ్చ జరగడం మామూలే అయినా ఈసారి అది శ్రుతి మించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ప్రభుత్వం ఆగ్రహం
ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ చేయడంలో భాగంగా ఏదో కుట్ర జరుగుతోందని భావించాల్సి వస్తోందని పేర్కొంది. నంది అవార్డులతో సంబంధం ఉన్న, లేని అంశాలను జోడించి మరీ వివాదాస్పదం చేస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఏపీలో ఓటు హక్కు కూడా లేదు
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలోనే ఉంటూ, అక్కడే పన్నులు కడుతున్నా తెలుగు వారంతా ఒక్కటే అన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే అనవసర రాద్దాంతం చేయడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించింది. ఈసారి నంది అవార్డు గ్రహీతల్లో చాలామందికి ఏపీలో కనీసం ఓటు హక్కు కూడా లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ప్రభుత్వం బాధ్యత
విదేశాల్లో ఉంటున్న తెలుగు వారు ఏపీలో ఆస్తులు కొనుక్కుని, ఇక్కడ కంపెనీలు పెడుతుంటే, తెలంగాణలో ఉన్న కొందరు సినీ ప్రముఖుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని ఆరోపించింది. నంది అవార్డుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేయడం వరకే ప్రభుత్వం బాధ్యత అని, ఎంపికలో దాని ప్రమేయం ఉండదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ప్రభుత్వం జోక్యం చేసుకోదు
అలా ఎంపికైన కమిటీలకు చైర్మన్లుగా గిరిబాబు, జీవిత, పోకూరి బాబూరావు ఉన్నారని, వారేమీ అనామకులు కాదని, అత్యంత అనుభవజ్ఞులని గుర్తు చేస్తున్నారు. వారు రూపొందించిన జాబితాను ఆమోదించడం తప్ప ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదని చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం
కాబట్టి వివాదాలను పక్కనపెట్టాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. వివాదం ఇలాగే కొనసాగితే అవార్డులను పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ప్రముఖ పత్రికలకి వార్త చేరవేసాయట అధికారగణం .


Click it and Unblock the Notifications











