సినిమా విజయం సాధించాలనే ఉద్ధేశంతో తాము ఇతరులపై ఆరోపణలు చేయడం లేదని ఆపదమొక్కులవాడు సినిమా నిర్మాత మల్లికార్జున రావు అన్నారు. తమ చిత్రాన్ని నైజాం, ఈస్ట్, వైజాగ్ ఏరియాల్లో విడుదల చేయడానికి సిరి మీడియా డిస్ట్రిబ్యూషన్ లో పెట్టామని, ప్రింట్లు కాకండా 60 లక్షల రూపాయలు అవసరమవుతుందని ముందుగానే పిడి ప్రసాద్ ను కోరామని, ప్రసాద్ మాత్రం రెండుమార్లు తిప్పించుకొని తరువాత చేతులెత్తేశారు. దీనితో తామే తంటాలు పడి సినిమాను విడుదల తేదీ సాయంత్రానికి 30లక్షల రూపాయలు పోగు చేశామని, అప్పుడు పిడి ప్రసాద్ కూడా 10లక్షలు సర్దుబాటు చేయడంతో మా సినిమా బయటపడిందని మల్లికార్జునరావు వివరించారు. సినిమా విడుదలలో జాప్యం జరగడంతో టాక్ దెబ్బతందని, తద్వారా కలెక్షన్లు రాలేదని ఆయన చెప్పారు. ఈ వివాదం పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తున్నది కాదని, ఆ దౌర్భాగ్యం తమకు పట్టలేదన్నారు. సినిమా బాగుంటేనే జనాలు ఆదరిస్తారు...లేకుంటే ఏమి చేసినా ఆడవని ఆయన స్పష్టం చేశారు.