బొబ్బిలిపులి నిద్రలేచింది...నో ప్రాబ్లం బాబూ మోహన్
బొబ్బిలిపులి లాంటి దాసరి నారాయణరావు నిద్ర లేచారని...చిత్ర పరిశ్రమలోని ఆ నలుగురి నిర్మాతల భరతం పట్టేందుకు ఆయన రెడీ అయ్యారని మాజీ మంత్రి, హాస్యనటుడు బాబు మోహన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ధన్నారం గ్రామంలో తెలుగుదేసం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా దాసరి నారాయణరావు మాటలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. చిత్రపరిశ్రమ ఆ నలుగురి కబంధ హస్తాల్లో ఉన్న విషయాన్ని తాను గతంలోనే చెప్పానని ఇప్పుడు ఇక దాసరి కూడా అదే అన్నారు కాబట్టి ఆ నలుగురి ఆటలు సాగవన్నారు. తన కుమారుడు ఉదయ్ బాబు హీరోగా నటించిన సమ్మక్క..సారక్క మహత్యం సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దాసరి స్పందించి చిన్న చిత్రాలకు అనుకూలంగా మాట్లాడుతూ చిత్ర పరిశ్రమను కాపాడేందుకు చేస్తున్న కృషిని నటుడిగా స్వాగతిస్తానని బాబుమోహన్ తెలిపారు. దాసరి...రాజశేఖర్ హీరోగా నట్టికుమార్ నిర్మిస్తున్న మా అన్నయ్య బంగారం చిత్రం ప్రారంభానికి వచ్చి ఆ నలుగురు నిర్మాతల చేతుల్లో చిన్న సినిమా నష్టపోతోందన్నారు.


Click it and Unblock the Notifications











