మాజీ ప్రధాని వాజ్పేయి ఇకలేరు.. బాలకృష్ణ, మోహన్బాబు తీవ్ర దిగ్బ్రాంతి
భారత రాజకీయ యోధుడు, మాజీ ప్రధాని, కవి అటల్ బీహారి వాజ్పేయి ఇక లేరు. గత కొద్దికాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాజ్పేయి గురువారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. వాజ్పేయి ఇక లేరన్న వార్తతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు విషాదంలో కూరుకుపోయారు. ఆయన చేసిన సేవలను స్మరించుకొన్నారు. మాజీ ప్రధాని మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు ఆయన ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థించారు.

మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోయాం !! - నందమూరి బాలకృష్ణ
మా 'బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్'ను జూన్ 22, 2000 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసిన మహానుభావుడు వాజపేయి గారు. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్ధుడు ఆయన. ఆయన విధివిధానాలు పలువురికి పారదర్శకంగా నిలిచాయి. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు.
వాజపేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు - డా౹౹ఎం.మోహన్ బాబు
వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు గారు, వాజపేయిగారు కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషులు చాలా అరుదు. ఆయన నిస్వార్ధపరుడైన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధుని కోరుకొంటున్నాను.


Click it and Unblock the Notifications











