'బాద్షా' లాంటి సినిమాలు చేయటం తప్పే

నవదీప్ మాట్లాడుతూ...''నేను పరిశ్రమలోకి వచ్చి పదేళ్లవుతోంది. అయితే ఇంతవరకు పూర్తిస్థాయి విజయవంతమైన కథానాయకుడిగా పేరు తెచ్చుకోలేకపోయాను. 'చందమామ' తర్వాత కొన్ని ప్రత్యేక పాత్రలనే చేయాలనే ఆలోచనతో ఒకేడాది ఏ చిత్రాలు అంగీకరించలేదు. దీంతో కాస్త ఇబ్బందులు పడ్డాను. మళ్లీ ఇప్పుడిప్పుడే మంచి సినిమా అవకాశాలు సాధిస్తున్నాను. ఈ క్రమంలోనే 'ఆర్య2', 'బాద్షా' లాంటి చిత్రాలు చేశాను. పాత్రల ఎంపికలో నేను చేసిన పొరపాట్లు కూడా నన్ను ఇబ్బంది పెట్టాయి. దీనికి తోడు నా కోపం కూడా నన్ను బాధ పెట్టింది ''అన్నారు.
ఇక ''ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ తియ్యలేదు... లేకపోతే ఎవ్వరూ తియ్యలేరు అనే కథలు ఉండవు. గతంలో వచ్చిన కథల్నే చెప్పే విధానంలో మార్పులు చేసుకొని కొత్తగా చూపించాలి. అంతేగానీ కథలు లేవు అంటూ ఒకరినొకరు నిందించుకోవడం సరికాదు'' అన్నారు నవదీప్. ''సంక్రాంతి రోజుల నేపథ్యంలో ఏడు రోజులపాటు సాగే కథ ఇది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనేది వంశీ కోరిక. భానుమతి అనే అమ్మాయి ఇచ్చిన ఆలోచనతో దొంగతనానికి ప్రయత్నిస్తాడు. అతడు ఆ పని చేయగలిగాడా.. అసలు ఎందుకు ఆ పనికి పూనుకున్నాడు అనేదే చిత్ర ప్రధానాంశం'' అని తెలిపారు.
ఏ హీరోకైనా హిట్స్ ఉంటేనే ఆకాశానికి ఎత్తేస్తారని, లేకపోతే విమర్శలు తప్పవని, ఇది అందరికీ వర్తిస్తుందని ఆయన వివరించారు. సినిమాలు ఏమీ చేయడంలేదని తన గురించి అనుకుంటున్న సమయంలో తమిళంలో చిత్రాలతో బిజీగా ఉన్నానని, తమిళంలో చిత్రాలతో బిజీగా ఉండడంతో తెలుగులో చేయలేకపోయానని ఆయన తెలిపారు. ప్రస్తుతం 'పొగ', 'అంత సీన్లేదు', 'అంతా నీమాయలోనే' వంటి చిత్రాల్లో నటించానని, ఇవన్నీ విడుదలకు సిద్ధమయ్యాయని ఆయన తెలిపారు.
మల్టీస్టారర్ చిత్రాల్లో చేయడానికి అభ్యంతరాలు ఏమీ లేవని, ఏ ఇద్దరి హీరోలు ఒక చిత్రంలో నటించినా, వారిద్దరికీ మంచి పేరు రావడం సహజమేనని ఆయన అన్నారు. ఫలానా హీరోతో చేస్తే తనకు పేరు రాకుండా వేరే హీరోకు స్టార్డమ్ వస్తుందన్న భావన ఎప్పుడూ తనలో ఉండదని, అటువంటి ఆలోచన కూడా తనకుండదని, తన ముందున్న చిత్రాలను వీలైనంత సమర్థవంతంగా మంచి చిత్రాలుగా రూపొందించుకుని, నటుడిగా నాలుగు మార్కులు సంపాదించుకోవడమే తన ముందున్న లక్ష్యమని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications











