పికె, బజరంగీలను వెనక్కి తోసి నెం.1 స్థానంలో ‘బాహుబలి’
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా నిలిచిన సంగతి తెలిసిందే. సౌత్ నుండి ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ‘బాహుబలి' సినిమా చరిత్రకెక్కింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ఇండియా వైడ్ కలెక్షన్ల ప్రకారం ‘బాహుబలి' నెం.1 స్థానంలో ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్లతో కలిపి పికె, బజరంగి భాయి జాన్ చిత్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా... ఓవర్సీస్ మార్కెట్లో తక్కవగా వసూలు చేయడం వల్ల వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయంలో బాహుబలి 3వ స్థానంలో ఉంది.
‘బాహుబలి' సినిమా తెలుగు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో విడుదల కావడం బాగా కలిసొచ్చింది. ఇండియా వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం అన్ని ప్రాంతాల, వివిధ బాషలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత బజరంగీ భాయిజాన్, శ్రీమంతుడు లాంటి చిత్రాలు విడుదలైన పోటీ తట్టుకుని బరిలో నిలిచింది.

ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో అత్యధికంగా వసూలు(గ్రాస్ అంచనా) చేసిన సినిమాలు..
1. బాహుబలి (ఇండియాలో రూ. 500 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 70 కోట్లు)
2. పికె (ఇండియాలో రూ. 440 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 300 కోట్లు)
3. బజరంగీ భాయిజాన్ (ఇండియాలో 420 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 170 కోట్లు)
వచ్చే ఏడాది ‘బాహుబలి' సెకండ్ పార్ట్ విడుదల కాబోతోంది. అప్పుడు కలెక్షన్లు మరింత ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి' ఫస్ట్ పార్ట్ చూసిన వారు రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. మిగిలిన 60 శాతం పూర్తి చేసి 2016లో సినిమాను విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











