కేసీఆర్ బయోపిక్: బాహుబలి రచయితతో సంప్రదింపులు
ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ఏపీ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ మీద బయోపిక్స్ మొదలయ్యాయి. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా బయోపిక్ రాబోతోందట.
ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం... లక్ష్మణ్ కొంతం నిర్మాణంలో ఇ.నివాస్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారట. కేసీఆర్ను తెలంగాణ జాతి పితగా చూపిస్తూ ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా విషయంలో బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ అయింది. దర్శక నిర్మాతలు ఇటీవలే ఆయన్ను సంప్రదించారని, కేసీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమా రూపంలోకి మలచాలని కోరారట. విజయేంద్ర ప్రసాద్ ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
కాగా... తెలుగు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి కూడా గతేడాది కేసీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో రాజ్ కుమార్ రావు లేదా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇంకా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కక ముందే కేసీఆర్ మీద ఇపుడు మరో బయోపిక్ తెరపైకి రావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











