నిరసన..బెదిరింపు....షో ఆపేసారు
బెంగుళూరు: బాలీవుడ్ సూపర్ హిట్ జోడీ షారుఖ్, కాజోల్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన దిల్వాలే . అందరూ ఊహిస్తున్నట్లుగానే ఈ సినిమాకు 'అసహనం' సెగ తగిలింది. ఆ మధ్యన షారుఖ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలోని మంగళూరులో ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు.
బజరంగ్దళ్ కార్యకర్తలు థియేటర్ల వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన చేయడంతో.. భద్రతా కారణాల రీత్యా థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శన ఆపేశారు. మంగళూరులోని సిటీ సెంటర్ మాల్, ఫోరం ఫిజా మాల్, భరత్ మాల్.. ఈ మూడు చోట్లా ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చినా, థియేటర్లను మూసేసారు.

షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలు వేటినీ ప్రదర్శించవద్దని కార్యకర్తలు బెదిరించినట్లు తెలుస్తోంది. దిల్వాలే సినిమా విడుదల అయినప్పటి నుంచి ఆ సినిమా మీద వీహెచ్పీ, బజరంగ్ దళ్ నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ కేవలం కొన్ని సంస్థలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడం వల్లే ఆయన సినిమాలను వ్యతిరేకిస్తున్నట్లు బజరంగ్ దళ్ కన్వీనర్ శరణ్ పంప్వెల్ తెలిపారు.
మరో ప్రక్క చిత్రం కలెక్షన్లు మూడు రోజుల్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన వివరాల ప్రకారం భారత్లో ఈ సినిమా కలెక్షన్లు రూ.65 కోట్లు. భారత్ మినహా ప్రపంచ వ్యాప్తంగా రూ.56 కోట్లు. మొత్తం కలిపి మూడు రోజుల్లో రూ.121 కోట్ల వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ఏడాదిలో భారత్లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రాల్లో దిల్వాలే మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











