Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
కొన్ని విషయాలు అలా దాస్తేనే మంచిది: బాలకృష్ణ
హైదరాబాద్ : సినిమాలో నేను మూడు గెటప్పులతో కనిపిస్తాను. ఆ విషయం బయటకు చెప్పలేదు. కొన్ని విషయాలు అలా దాస్తేనే మంచిది. 'భైరవద్వీపం'లో కూడా ఓ గెటప్పును అలాగే దాచమని చెప్పానప్పట్లో. జర్నలిస్టు పాత్ర చేయడం ఇదే మొదటిసారి. ఈ రోజుల్లో జర్నలిజం ప్రాముఖ్యత పెరిగింది. ప్రాణాల్ని పణంగా పెట్టి సమాజానికి సేవ చేస్తున్నారు. అలాంటి పాత్ర నాకు దక్కినందుకు గర్వంగా ఉంది అన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం 'శ్రీమన్నారాయణ'. పార్వతి మెల్టన్, ఇషాచావ్లా హీరోయిన్స్. రవికుమార్ చావలి దర్శకత్వం వహించారు. రమేష్ పుప్పాల నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. ఆదివారం హైదరాబాద్లో చిత్ర విజయోత్సవాన్ని నిర్వహించారు.
అలాగే రవి చావలి కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. తనతో కచ్చితంగా ఒక మంచి సినిమా చేయొచ్చు అనిపించి 'ఓకే' చెప్పా. కథ ఎంత బాగా చెప్పాడో సినిమాను అంతకంటే బాగా తీశాడు. ముఖ్యంగా జర్నలిస్ట్గా నా పాత్రను తను మలిచిన తీరు బాగుంది. ఈ పాత్ర చేయడం ఓ గొప్ప అనుభూతి. ఆర్టిస్టుల పరంగా, టెక్నీషియన్స్ పరంగా ప్రతి విషయంలో 'శ్రీమన్నారాయణ' బెస్ట్గా తయారైంది. అందుకే ఈ విజయం అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఇక ''మంచి కథ, నిర్మాణ సంస్థ, సమర్ధంగా తెరకెక్కించే దర్శకుడు... ఈ మూడూ కుదిరినప్పుడు తప్పకుండా మంచి సినిమాలొస్తాయి. కొత్తదనాన్ని కోరుకొనే ప్రేక్షకులుండగా ప్రయోగాలు చేయడానికి నేను ఏ మాత్రం భయపడను. వ్యాపారాత్మకంగా కాకుండా.. ఉన్నతమైన ఆశయంతో ఈ సినిమాని తీశాడు నిర్మాత. దర్శకుడు కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకొంది. తప్పకుండా మంచి సినిమా అవుతుందని ఆ రోజే అనుకొన్నాను. తెలుగుదనం ఉన్న దర్శకుడు రవి. తను చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. సంగీతం కూడా బాగుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు చక్రి అనగానే... సగం విజయం సాధించినట్టు భావించాను. సంభాషణలు కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా రాశారు''అన్నారు బాలకృష్ణ.
కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ''తెలుగు సినిమాని ప్రేక్షకులకు ఒక తెలుగు సినిమాలాగే అందించాలన్న తపన ఉన్న కథానాయకుడు బాలకృష్ణ. మనవాళ్లే ప్రతినాయకులుగా ఉండాలని పట్టుబట్టి చేయించుకొంటారు. అన్ని అర్హతలున్న ఒక తెలుగు దర్శకుడు రవికుమార్'' అన్నారు. వేదికపై బాలకృష్ణ ఈ చిత్రంలోని 'చలాకీ చూపులతోనే...' అనే పాట పాడి సభికులను అలరించారు. ఆడియో వేడుకలోనూ ఆయన ఓ పాటకు నృత్యం చేసి అభిమానుల్ని సంతోషపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, ఘటికాచలం, గౌతమ్రాజు, అంబికా కృష్ణ, ప్రభు, జయవాణి, దువ్వాసి మోహన్, కృష్ణభగవాన్, జయప్రకాష్రెడ్డి, రాజా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.