బాలయ్య మంచితనం-అలుసు తీసుకుంటన్న దర్శకులు!
హైదరాబాద్ : నందమూరి నట సింహం బాలకృష్ణ రేంజి ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నటన విషయంలో ఆయనకు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న నటులు ఎవరూ సాటిరారంటే అతిశయోక్తి కాదేమో. ఇక బాలయ్య డైలాగ్ డెలివరీకి థియేటర్లు దద్దరిల్లాల్సిందే.
అయితే...ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీసును శాసించిన బాలకృష్ణ సినిమాలు ఈ మధ్య అంచనాలను అందుకోవడం లేదు. గత పది పన్నెండేళ్లలో బాలయ్య దాదాపు 20కిపైగా సినిమాలు చేస్తే అందులో భారీ సూపర్ హిట్ చిత్రాలు కనీసం 5 కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో సింహా తర్వాత ఆయనకు సరైన హిట్ లేదు. శ్రీరామరాజ్యం హిట్టే కానీ కమర్షియల్ హిట్ కాదు.
మరెందుకిలా జరుగుతోంది? అంటే కథలు ఎంపిక, దానికి సరైన దర్శకులను ఎంచుకోవడంలో బాలయ్య విఫలం అవుతున్నాడనే వాదన వినిపిస్తోంది. అందుకు తాజా ఉదాహరణ 'ఊకొడతారా ఉలిక్కి పడతరా' చిత్రమే. ఈచిత్రం చూసిన చాలా మంది బాలయ్య ఈ పాత్ర చేయడానికి ఎలా ఒప్పుకున్నారంటూ విమర్శ చేసారు.
తాజాగా బాలయ్య 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' దర్శకుడితో పాటు, పెద్దగా హిట్లులేని రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి, ప్లాప్ డైరెక్టర్గా ముద్రపడ్డ జీవీ సుధాకర్ నాయుడితో ఓ ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఒక్కసారి కథ ఒప్పుకుంటే బాలయ్య దర్శకుడి పనిలో జోక్యం చేసుకోరు. అది ఆయన మంచితనం. ఈ మంచి తనాన్నే అలుసుగా తీసుకుంటున్న డైరెక్టర్లు రెచ్చిపోతున్నారు. బాలయ్య ఇమేజ్తో చెడుగుడు ఆడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మరి కొన్ని రోజుల్లో బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాకు బాలయ్య సరైన కథను, సరైన దర్శకుడినే ఎంచుకున్నారా? అనేది తేలాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











