జూన్ 1 నుంచి బాలకృష్ణ ముఖానికి మేకప్
హైదరాబాద్: పార్టీ ప్రచారంలో బిజీగా బాలకృష్ణ జూన్ 1 నుంచి మళ్లీ తన రెగ్యులర్ యాక్టివిటీస్ లోకి రానున్నారు. ఆ రోజు నుంచి తన కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కొత్త దర్శకుడు సత్యదేవా డైరక్షన్ లో ఓ చిత్రం చేయబోతున్నారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించబోతున్నారు. ఈ చిత్రం మే 9 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. జూన్ 1 నుంచి షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేసారు. ఆ రోజు నుంచి ఆయన ముఖానికి మేకప్ వేసుకుని విజృంభించనున్నారు.
ప్రస్తుతం ఆకట్టుకునే డైలాగులు.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు.. జగన్పై వాడివేడి విసుర్లులతో అనంతపురం జిల్లా పుట్టపర్తి, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో బాలకృష్ణ ప్రచార పర్వం నడుస్తోంది. తెలుగు జాతి గొప్పతనాన్ని, సీమ పౌరుషాన్ని పద్యాల్లో వ్యక్తపరుస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు. తెదేపా కులమతాలకు అతీతంగా ఉంటుందని చెప్తూ తన చిత్రంలోని ''కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, వడ్రంగిని'' అనే సంభాషణను ఉద్రేకంగా చెప్పి అలరించారు.

తండ్రి ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ 'జీవంనాస్తి' అంటూ రాగయుక్తంగా పద్యాన్ని అందుకున్నారు. వేషాలు వేసుకునే వారికి రాజకీయాలు ఏం తెలుసన్న షర్మిల విమర్శకు ప్రతి విమర్శ చేస్తూ 'ఫ్లూటు జింక ముందు వూదు.. సింహం ముందు కాదు' అంటూ లెజెండ్ సినిమా డైలాగ్ చెప్పారు. తన చిత్రాల్లోని పదునైన సంభాషణలను ప్రచారంలో వినియోగిస్తూ ముందుకు సాగుతున్నారు.
గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











