బలుపు : బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్న సీన్లు ఇవే!
హైదరాబాద్ : రవితేజ నటించిన 'బలుపు' చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే అందులోని కొన్ని సీన్లు, డైలాగులు మాత్రం బ్రాహ్మణ సంఘాల ఆగ్రహానికి గురవుతున్నాయి. గతంలో 'దేనికైనా రెడీ' చిత్రంలో నటి సురేఖ నటించిన సీన్లు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా 'బలుపు' చిత్రంలో కూడా ఆమె చెప్పిన డైలాగులే వివాదాస్పదం కావడం గమనార్హం.
'దేనికైనా రెడీ' చిత్రంలో సురేఖ బ్రాహ్మణ ఇల్లాలుగా నటించింది. అందులో ఆమె పాత్ర అభ్యంతరకరంగా ఉందని, మరికొన్ని సీన్లు కూడా తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అప్పట్లో బ్రాహ్మణ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ చిత్ర నిర్మాత మోహన్ బాబు కుటుంబానికి, బ్రాహ్మణ సంఘాలకు మధ్య ఓ చిన్నపాటి యుద్దమే జరిగింది. మోహన్ బాబుకు కొందరు బ్రాహ్మణులు పిండప్రధానం చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
తాజాగా....'బలుపు' చిత్రంలో గతంలో బ్రాహ్మణులు చేసిన ఆందోళనపై సెటైరిక్గా కొన్ని సీన్లు పెట్టారు. 'మొగుడిలా ఉన్నావంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. పిండాలు పెట్టేస్తున్నారు' అంటూ సురేఖ చెప్పిన డైలాగ్ తాజాగా బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయింది. ఆ డైలాగ్ తమను టార్గెట్ చేసే విధంగా ఉందని బ్రాహ్మణులు వాదిస్తున్నారు.
ట్రైలర్లోనే ఇలాంటి డైలాగు ఉంటే సినిమాలో మాపై ఇంకెలాంటి సీన్లు ఉంటాయో? అని అనుమానిస్తున్న బ్రాహ్మణులు.....ఈ చిత్రం విడుదలకు ముందు సర్ట్ఫికెట్ జారీ చేయకుండా బ్రాహ్మణ సంఘాల పెద్దలకు ఒకసారి ఈ చిత్రాన్ని చూపించిన తర్వాతే జారీ చేయాలని, బ్రాహ్మణులను అవమానించే రీతిలో ఉన్న మాటలు, సన్నివేశాలను తొలగించాలని, ఆ తర్వాతే ఆ చిత్రానికి సర్ట్ఫికెట్ను జారీ చేయాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రీజనల్ సెన్సార్బోర్డు, ఫిల్మ్ చాంబర్కు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది.


Click it and Unblock the Notifications











