'మా సినిమాను చంపేశారు' అంటూ దర్శకుడు
హైదరాబాద్: వరుణ్సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'సరదాగా అమ్మాయితో'. ఛార్మి కీలక పాత్రధారి. పి.భానుశంకర్ దర్శకుడు. పత్తికొండ అర్పిత, పత్తికొండ కిషోర్, పత్తికొండ కిరణ్, పత్తికొండ కుమారస్వామి నిర్మాతలు. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ లేవు. ఈ నేపధ్యంలో నిర్మాత పత్తికొండ కుమారస్వామి ఆవేదనతో మీడియాతో మాట్లాడారు.
'విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న చిత్రాన్ని థియేటర్ల నుంచి తీసేసి మా సినిమాను చంపేశారు. నిర్మాతగా ఈ సినిమా విడుదల చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోతే నిర్మాత, సినిమాలు ఎలా గట్టెక్కాలి. ఒక చిన్న సినిమా బ్రతికితే వంద మందికి ఆధారం లభిస్తుంది. ఎవరు సహకరించానా..సహకరించకపోయినా మా సంస్థలో మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తాను. అవి కూడా విడుదల చేసి నేనేంటో నిరూపించుకుంటాను' అన్నారు పత్తికొండ కుమారస్వామి.
దర్శకుడు మాట్లాడుతూ 'విడుదలైన అన్ని ఏరియాల్లో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆడుతున్న చిత్రాన్ని థియేటర్లలో నుంచి తప్పించి చంపేశారు. దీనిపై పోరాటం చేస్తాం' అన్నారు. సంగీత దర్శకుడు రవివర్మ మాట్లాడుతూ 'చక్కని సంగీతానికి మంచి సాహిత్యం తోడవ్వడంతో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ' అన్నారు.
ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎనిమిది కోట్లు దాటిందని ఫిల్మ్ నగర్ సమాచారం. వరస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ సందేశ్ మీద ఆ రేంజి బడ్జెట్ పెడితే ఎంత వరకూ వర్కవుట్ అవుతుందంటున్నారు. ఎంత పెద్ద హిట్టైనా...ఐదు కోట్లు దాటి రెవిన్యూ రాదని లెక్కలు చెప్తున్నారు. సుమన్, అలీ, ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, ముమైత్ఖాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవివర్మ, స్క్రీన్ప్లే: సురేంద్ర కృష్ణ, నిర్మాతలు: పత్తికొండ అర్పిత్, పత్తికొండ కిషోర్, పత్తికొండ కిరణ్, దర్శకత్వం: భానుశంకర్.


Click it and Unblock the Notifications












