బాలకృష్ణకు భూమిక, చిరంజీవికు చార్మి
చిరంజీవికు చార్మి, బాలకృష్ణకు భూమిక, వెంకటేష్ కు అనుష్క, నాగార్జునకు ప్రియమణి ప్రచారం చేయటానికి ముందుకొచ్చారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) నిర్వహించే టీ20 క్రికెట్ కప్ కోసం ఈ ఏర్పాట్లు జరిగాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ నలుగురు హీరోయిన్స్ ని ఆయా జట్లకు అధికార ప్రతినిధులుగా ఎంపిక చేశారు. హీరోయిన్స్ ఆటా పాట, అగ్రహీరోల హుషారెత్తించే మాటలతో ఈ కార్యక్రమం సందిడిగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ "ఇంతకు ముందు నేను కెప్టెన్గా రెండుసార్లు కప్ ను అందుకున్నా. ఈసారి కూడా మేమే గెలుస్తాం. హ్యాట్రిక్ సాధిస్తాం. అయినా మా నలుగురిలో ఎవరు గెలిచినా అది నా జట్టు విజయంగానే భావిస్తా" అన్నారు.
తనదైన శైలిలో నృత్యం చేస్తూ వేదిక మీదికొచ్చిన బాలకృష్ణ "వరద బాధితుల సహాయార్థం కేవలం ఇరవై రోజుల వ్యవధిలో స్టార్ నైట్ కార్యక్రమం నిర్హహించి విజయవంతం చేశాం. అలాగే ఈ తారల క్రికెట్ మ్యాచ్ లు కూడా విజయవంతంగా పూర్తి చేస్తాం" అన్నారు. "సచిన్ ని మా జట్టులో చేర్చుకునైనా ఈ కప్ సాధిస్తా"మని నాగార్జున చమత్కరించారు. ఇక సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతంతో కార్యక్రమాన్ని అలరించాడు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు మురళీ మోహన్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ ఏకె ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ తారల టీ20 క్రికెట్ మ్యాచ్ లు ఈనెల 13న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరుగనుంది.
చిరు టీమ్ పేరు చిరు చీతాస్, బాలయ్య టీమ్ పేరు బాలయ్య లైన్స్, నాగ్ టీమ్ పేరు నాగ్ కింగ్స్, వెంకీ టీమ్ పేరు వెంకీ వారియర్స్ అని ఖరారు చేశారు. ఈ మాచ్ మాక్స్ చానెల్ లో టెలికాస్ట్ అవుతుందని సమాచారం. రిథమ్ మీడియా మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్ని ద్వారా వచ్చిన మొత్తాన్ని 'మా" కి సొంత బిల్డింగ్ తో పాటు..పేద కళాకారులకు ఆర్థిక సహాయం అందించనున్నారు..ఈ మ్యాచ్ లలో ఆడుతున్న హీరోలందరూ ఇప్పటికే ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉన్నారు.


Click it and Unblock the Notifications











