మోహన్బాబు నుంచి పద్మశ్రీ వెనక్కితీసుకోండి
హైదరాబాద్ : బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా చిత్రీకరించిన 'దేనికైనా రెడీ' సినిమా నిర్మాత మోహన్బాబు నిర్వాకాన్ని ఖండించాల్సిందిపోయి, తెలుగు చలనచిత్ర మండలి వెనకేసుకురావడం గర్హనీయమని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. బ్రాహ్మణసమాజం గత రెండు వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు వీధుల్లోకి వచ్చిందో డి.రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణలకు అర్థం కాలేదా? అని ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వాళ్లేమైనా సుద్దులు చెప్పదలుచుకుంటే మోహన్బాబుకు చెప్పుకోవాలని సూచించారు.
'దేనికైనా రెడీ' సినిమాలో బ్రాహ్మణ మహి ళలను అసభ్యకరంగా చూపించారని, పవిత్ర చండీయాగాన్ని డబ్బుల కోసమే చేస్తున్నట్టుగా నిందలు వేశారని ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరుస్తున్న మోహన్బాబు నుంచి.. పద్మశ్రీ అవార్డును వెనక్కితీసుకోవాలని కోరారు. మోహన్బాబు నిర్వాకాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖండించాల్సిందిపోయి ఆయన్ను వెనకేసుకురావడం గర్హనీయమన్నారు.
ఎన్నడూ లేనివిధంగా బ్రాహ్మణ సమాజం వీధుల్లోకి ఎందుకు వస్తుందో సామాజిక స్పృహ కలిగిన రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు. వాళ్లేమైనా సుద్దులు చెప్పదల్చుకుంటే మోహన్బాబుకు చెప్పాలని సూచించారు. ఈ చిత్రం తీసినవారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని న్యాయస్థానం తీర్పు చెప్పినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ప్రభాకర్ ధ్వజమెత్తారు.విష్ణు, మోహన్బాబులను అరెస్ట్ చేసి, జైలుకు పంపించాలని ద్రోణంరాజు రవికుమార్ డిమాండ్చేశారు.
తమను కించ పరచే విధంగా సినిమాను తీశారంటూ 'దేనికైనా రెడీ' చిత్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు చేపట్టిన ఆందోళన బుధవారం అనేక మలుపులు తిరిగి ఈ చిత్రంపై ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ హామీ ఇచ్చారు. అలాగే బ్రాహ్మణిజం చిత్రంపై వేసిన కమిటీ నివేదిక ఆధారంగా ఒకటి రెండు రోజుల్లో చిత్రాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
కాగా, దేనికైనా రెడీ చిత్రంపై పది మంది సభ్యులతో విడిగా మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. తాము చేపట్టిన ఆందోళన విజయవంతం కావడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించాలని బ్రాహ్మణ సంఘాలు నిర్ణయించాయి. 'దేనికైనా రెడీ' చిత్రంపై కమిటీ వేయడానికి ప్రభుత్వం అంగీకరించినందున తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు బ్రాహ్మణ సంఘాల నాయకుడు తులసి శ్రీనివాస్ చెప్పారు.


Click it and Unblock the Notifications











