'దేనికైనా రెడీ' వివాదం...నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా
హైదరాబాద్ : 'దేనికైనా రెడీ' సినిమా వివాదం ఇంకా చల్లారలేదు. 'దేనికైనా రెడీ' సినిమాను రద్దు చేయాలని, అందులో బ్రహ్మణులను కించపరుస్తూ ఉన్న సన్నివేశాలను తొలగించాలని, మోహన్బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని, దాడిలో గాయపడ్డవారిని పరామర్శించాలనే డిమాండ్లతో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్నట్లు వారు వివరించారు. సమాజానికి సందేశాన్ని ఇచ్చే సినిమాలు తీయాలని, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే చైతన్యవంతమైన ప్రజలు నిలదీస్తారని హెచ్చరించారు. సినీ నిర్మాతలు వారి ఆర్థిక ప్రయోజనాల కోసం కులాలను వాడుకోవడం, ఆయా కులాలను అవమాన పరిచే విధంగా చిత్రీకరించే చిత్రాలపై, సినీ హీరోలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
'దేనికైనా రెడీ' సినిమా వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని బ్రహ్మణ సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఈ క్రమంలో కొత్తగా బ్రహ్మణ సంఘాల జేఏసీ ఆవిర్భవించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 బ్రహ్మణ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. ప్రత్యేకంగా జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణను వీరు ఖరారు చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రహ్మణులకు దిశానిర్దేశం చేస్తారని జేఏసీ బాధ్యులు తెలిపారు.
తెలుగు చిత్రపరిశ్రమలో కొందరు పేరు ఉన్న అగ్రహీరోలు తమ సినిమా ఉనికి కోసం, పురోహితులుగా ఉన్న పాత్రలను సృష్టించి వారితో కొన్ని అభ్యం తరకర సన్నివేశాలు చేయిస్తూ, సమాజంలో ఆ వర్గానికి చెడ్డ పేరు వచ్చేలా గతంలో యత్నాలు చేసి, తమ సినిమా లాభాల బాట పట్టేలా చూసుకున్నారని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
అటువంటి హీరోల సినిమాకు మాటలు, పాటల రచయితలుగా కొందరు బ్రాహ్మణులు రాస్తున్నారనే విష యం వారు మర్చిపోయి, సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం దేనికైనా రెడీ సినిమా వివాదాస్పద మైనప్పటికీ, సినీ పరిశ్రమలో ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ఎందుకు ప్రశ్నించడం లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే వారికి తరువాత వచ్చే సినిమాల్లో అవకాశాలు ఉండవనే కారణంతోనే వారు ప్రశ్నించడం లేదని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు కొందరు నటుల, రచయితల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంపల్లి సినీ ప్లానెట్ ఎదుట ధర్నా
చింతల్: 'దేనికైనా రెడీ' సినిమాను నిలిపివేయాలంటూ కొంపల్లి సినీ ప్లానెట్ ఎదుట బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సినిమా పోస్టర్ను చించారు. మోహన్బాబు, విష్ణులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఇంట్లో ఏ శుభకార్యానికీ హాజరు కాకూడదని తీర్మానించారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుధాకర్శర్మ పాల్గొన్నారు.
వివేక్నగర్లో సంతకాల సేకరణ
దోమలగూడ: మోహన్బాబు, మంచు విష్ణులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దోమలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వివేక్నగర్ శ్రీఆంజనేయస్వామి ఆలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్, నాయకులు ఎస్ శ్రీనివాస్ యాదవ్, పరిమళకుమార్, బద్రీనారాయణ, రవీందర్, ఆర్.పద్మ, కె ఆంజనేయులు, వెంకటేష్, టి.గోపాల్ పాల్గొన్నారు.
ఆర్టీసీ క్రాస్రోడ్లో కొవ్వొత్తుల ప్రదర్శన
చిక్కడపల్లి: మోహన్బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రపదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య, మహాభాగ్యనగర్ బ్రాహ్మణ సేవాసమితి, తెలంగాణ రాష్ట్ర అర్చక సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఆర్టీసీ క్రాస్రోడ్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సమాఖ్య యూత్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు రవికుమార్, సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తి శర్మ, తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు శ్యామ్ మోహన్ శర్మ, పాల్గొన్నారు.
మరో ప్రక్క బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చిత్రీకరించిన దేనికైనా రెడీ సినిమాను తక్షణమే నిషేధించాలంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బ్రాహ్మణులకు మద్దతుగా ఆందోళన నిర్వహించింది. ఎమ్మార్పీఎస్ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ మాట్లాడుతూ... బ్రాహ్మణ కులస్థుల మనోభావాలను దెబ్బతీసే సినిమాలను తక్షణం నిషేధించాలని, లేనిపక్షంలో వివాదాస్పద సన్నివేశాలను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. మోహన్బాబు, విష్ణు ఇంటి ముందు రాజ్యాంగబద్దంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బ్రాహ్మణులను విచక్షణరహితంగా కొట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. సెన్సార్ బోర్డు ఏమి చేస్తుందని ప్రశ్నిస్తూ, ప్రజల్లో చైతన్యం వచ్చిందని, సినిమా సినిమాలా చూడాలంటూ సినీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు చెప్పడం సబబుకాదన్నారు.


Click it and Unblock the Notifications











