చిరు 150: పబ్లిసిటీ స్టంటే, తేల్చుకుందామన్న బివిఎస్ రవి
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా ప్రకటన రాగానే కాపీ వివాదం కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. బివిఎస్ రవి తన స్టోరీ లైన్ కాపీ కొట్టారంటూ దేవ్ వర్మ అనే రచయిత మీడియాకెక్కాడు. ఈ నేపథ్యంలో బివిఎస్ రవి స్పందించారు. తనపై ఆరోపనలు చేసిన రైటర్ పై విరుచుకుపడ్డాడు.
‘పబ్లిసిటీ కోసం నా స్టోరీ కాపీ కొట్టారంటూ ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని రైటర్స్ యూనియన్లోనే చర్చించుకుంటాం. మేము స్టోరీ కాపీ కొట్టలేదుకాబట్టి ఎలాంటి సమస్యా ఉండదు' అంటూ బివిఎస్ రవి ట్వీట్ చేసారు. ఏ విషయమైనా రైటర్స్ యూనియన్ ద్వారా పరిష్కరించుకోవాలి, ఇలా మీడియా కెక్కడం సబబు కాదంటూ ఆయన అభిప్రాయ పడ్డారు. ఇది కొత్త తరహా కథ. మెగాఫ్యాన్స్, మెగా ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని పూరి జగన్నాథ్ గారు స్వయంగా దీన్ని డిజైన్ చేసారు అంటూ బివిఎస్ రవి చెప్పుకొచ్చారు.
ఈ విషయమై పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నా సమక్షంలో తయారైన ఒరిజినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు.

అయితే ఈ వివాదంపై అటు చిరంజీవి గానీ, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్ గానీ స్పందించలేదు. సినిమా గురించిన వివరాలు మాత్ర చరణ్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.
సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.


Click it and Unblock the Notifications











