నా అనుమతి తీసుకోవాల్సిందే: ఇళయరాజా సీరియస్
చెన్నై: ప్రతి రోజూ టీవీల్లో, ఎఫ్ఎం రేడియోల్లో ఇళయరాజా స్వరపర్చిన పాటలను మనం ఎక్కడో అక్కడ వింటూనే ఉన్నాం. ఆయన పాటలు ఎంత వినసొంపుగా ఉంటాయంటే.... మళ్లీ మళ్లీ వినాలనిపించేంత మధురంగా ఉంటాయి. అయితే తన పాటలు తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు టీవీ, రేడియో ఛానల్స్ ప్రసారం చేయడంపై, ఆడియో కంపెనీలు సీడీలు చేసి అమ్మడంపై ఇళయరాజా ఆగ్రహంగా ఉన్నారు.
తన పాటలను సీడీల రూపంలో, ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ రూపంలో అమ్ముతున్న ఐదు ఆడియో కంపెనీలపై కేసు వేసారు కూడా. మద్రాసు హై కోర్టు కూడా ఆయనకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇకపై తన పాటలు ఎవరు ఎక్కడ వాడాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందే, తన వద్ద రైట్స్ కొనుక్కోవాల్సిందే అని ఇళయరాజా స్పష్టం చేసారు.

నేను స్వరపర్చిన పాటలన్నింటి పైనా హక్కులు నావే.. కావాలంటే రైట్స్ కొనుక్కోండంటూ ప్రకటన విడుదల చేసారు. తన అనుమతి లేనిదే తన పాటలు ప్రసారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. 1970 నుండి పాటలను స్వర పరుస్తున్న ఇళయరాజా ఇప్పటి వరకు 4500 పాటలను కంపోజ్ చేసారు.
నేను పాటలను కంపోజ్ చేసాను, వాటిని సినిమాల కోసం అమ్ముకున్నాను....కానీ కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం ఆ పాటలపై సర్వ హక్కులు నావే. నా అనుమతి లేకుండా ఇతరులు వాడటానికి వీలు లేదు. ముఖ్యంగా ఆడియో కంపెనీలు నా పాటలను నా అనుమతి లేకుండా అమ్మడానికి వీలు లేదు అని తెగేసి చెప్పారు.


Click it and Unblock the Notifications











