'బాద్షా' నిర్మాత బండ్ల గణేష్ పై కేసు
హైదరాబాద్: ఎన్టీఆర్ 'బాద్షా' ఆడియో విడుదల తొక్కిసలాట ఘటనపై రాయదుర్గం పీఎస్లో కేసు నమోదైంది. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్, తదితరులపై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా ఆడియో విడుదల వేడుకలో అపశ్రుతి చోటుచేసుకొంది. తొక్కిసలాటలో వరంగల్లోని ఉర్సుగుట్టకు చెందిన ముక్కల రాజు(22)అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే... ఆదివారం రాత్రి హైదరాబాద్ శివారు నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియో ఆవరణలో నిర్వహించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఎన్టీఆర్ ప్రాంగణానికి వస్తున్నట్లు ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ప్రవేశద్వారం వద్దకు చేరుకొన్నారు. ఆ సమయంలో తొక్కిసలాట జరగటంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. వరంగల్లోని ఉర్సుగుట్టకు చెందిన ముక్కల రాజు(22)అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్ తదితరులపై రాయదుర్గ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిమితికి మించి పాస్లను జారీ చేయడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 3 వేల వీవీఐపీ సీట్ల సామర్థ్యం ఉండగా 20 వేల మందికి పైగా పాస్లు మంజూరు చేసినట్లు తెలిసింది. కార్యక్రమానికి అనుమతి ఉన్నప్పటికీ ఎక్కువ పాస్లు జారీ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సైబరాబాద్ పోలీసుకమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.


Click it and Unblock the Notifications











