ఇరికించారా?... చక్రి, పరుచూరిపై కేసు వాపస్
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి, నిర్మాత పరుచూరి ప్రసాద్లపై రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ యువతి వీరిపై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన ఫిర్యాదును యువతి ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
సదరు యువతి తాగిన మత్తులో ఫిర్యాదు చేసినట్లు పోలీసులకు చెప్పిందని, అందుకే తన ఫిర్యాదు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించిందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. స్నేహితుల దినోత్సవం రోజున జరిగిన ఓ అనూహ్య సంఘటన ఫిర్యాదుకు దారి తీసినట్లు సమాచారం.

స్నేహితుల దినోత్సవం రోజున చక్రి, పరుచూరి ప్రసాద్ కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో యువతి యొక్క ఫ్రెండ్ వారిని ఫోటో తీసేందుకు ప్రయత్నించారని, అయితే తమను సెల్ ఫోన్లో ఫోటోలు తీయొద్దని వారు అడ్డు చెప్పడంతో...యువతి, ఆమె ఫ్రెండ్ అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిన్నపాటి వాదులాట చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ కోపంతోనే వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సంగీత దర్శకుడు చక్రిపై ఒక్కసారిగా ఇలాంటి కేసు నమోదు కావడంతో అంతా అవాక్కయ్యారు. కేసు ఉపసంహరించుకోవడంతో చక్రి అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











