‘దమ్ము’ రికార్డు బద్దలుకొట్టిన ‘రాంబాబు’
హైదరాబాద్ : ఏపీ బిజినెస్ పక్కన పెడితే...తెలుగు సినిమాలకు కర్నాటక, తమిళనాడు, కేరళల్లో మంచి మార్కెట్ ఉంది. కర్నాటక రాష్ట్రంలో ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం నాలుగు రోజుల్లో రూ. 2.71 కోట్లు వసూలు చేసి రికార్డు నమోదు చేయగా...తాజాగా ఆ రికార్డును పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ 'రాంబాబు'గా వచ్చి రికార్డు బద్దలు కొట్టాడు.
ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రం అక్కడ 150 థియేటర్లలో విడుదల కాగా.....పవన్ 'రాంబాబు' చిత్రం కేవలం 100 థియేటర్లలో మాత్రమే విడుదలైంది. అయినప్పటికీ 'దమ్ము' చిత్రం రికార్డులను 'రాంబాబు' అవలీలగా బద్దలు కొట్టడం గమనార్హం. కర్నాటకలో వీకెండ్ షేర్ వసూళ్ల విషయంలో....కెమెరామెన్ గంగతో రాంబాబు, దమ్ము, ఈగ, గబ్బర్ సింగ్, జులాయి చిత్రాలు వరుసగా తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.
ఇక టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...తొలి వారాంతంలో తొలి రోజు(గురువారం) ఈచిత్రం రూ. 14.37 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ. 12.23 కోట్లు రాబట్టింది. శనివారం కావడంతో భారీగా బిజినెస్ పుంజుకుని రూ. 13 కోట్లు వసూలు చేసింది. ఆదివారం సెలవు దినం కావడంతో రికార్డు స్థాయిలో రూ. 14.59 కోట్లు రాబట్టింది.
పవన్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. యూనివర్సల్ మీడియా బేనర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు. విడుదలైన మరుసటి రోజే ఈచిత్రంపై తెలంగాణ వివాదం నెలకొన్నప్పటికీ...వివాదాస్పద సీన్లు తొలగించడంతో సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.


Click it and Unblock the Notifications











