మార్గదర్శి అవార్డును ఆవిష్కరించిన చార్మి
హైదరాబాద్ : భారతీయ చలనచిత్ర రంగం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్గదర్శి బిగ్ తెలుగు ఎంటర్టైన్మెంట్ అవార్డ్సు కార్యక్రమంలో ప్రత్యేకమైన ప్రదర్శన ఇస్తానని సినీ నటి చార్మి పేర్కొన్నారు. గురువారం హోటల్ వివంటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని పురస్కార ప్రతిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ ఈ నెల 8న శిల్పకళావేదికలో జరగనున్న వేడుకల్లో పాలు పంచుకోనుండడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమానికి తనను ప్రచారకర్తగా ఎంచుకోవటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డులో అన్ని విభాగాల వారిని చేర్చారని, సినిమా, క్రీడలు, నాటక రంగం తదితర అంశాల్లో విజేతలను ఎంపిక చేయటం గొప్ప విషయమని పేర్కొన్నారు.

పెళ్లి గురించి మాట్లాడుతూ... ''అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారు. పాతికేళ్లొస్తే పెళ్లి చేసుకోవాల్సిందేనా? నలభయ్యేళ్లకి కూడా చేసుకోవచ్చు. కెరీర్ని చక్కబెట్టుకోవడానికి మాత్రం ఇదే సరైన సమయం. అందుకే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనేమీ లేదు. తెలుగులో 'ప్రతిఘటన'లో నటిస్తున్నాను. నిశ్చల అనే పాత్రలో పాత్రికేయురాలిగా కనిపిస్తాను. ఇందులో ఏడు పేజీల డైలాగ్ ఒకటుంది. అది చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 'మంత్ర 2'లో కూడా నటించబోతున్నా'' అని వివరించింది.
ఇక ''తెరపై ఎలాంటి పాత్రల్లోనైనా కనిపించొచ్చు. అయితే ఇదివరకు నాకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఓ హీరోయిన్ ని ఎలా చూపిస్తున్నాం? ఎలాంటి దుస్తులు వేయిస్తున్నాం? అని కూడా ఆలోచించకుండా సినిమాలు తీశారు. అవి టీవీల్లో వస్తున్నాయంటే వెంటనే కట్టేస్తాను. అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదనే దర్శకుల విషయంలో పక్కాగా ఉంటాను. మాట మీద కట్టుబడి సినిమా తీస్తానంటేనే ఒప్పుకొంటుంటా'' అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి.


Click it and Unblock the Notifications











