తెలుగు నేల చిన్నబోయింది: బాపు మృతిపై చిరు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బాపు మృతికి కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. బాపు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగుదనానికి పర్యాయపదం, తెలుగు సినిమా దృశ్యకావ్యం బాపు అని చిరంజీవి అన్నారు. బాపు మృతితో తెలుగు నేల చిన్నబోయిందని, తెలుగుదనం మసకబారిందని ఆయన అన్నారు.
బాపు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. బాపు కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాపు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. బాపు మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటు అని అన్నారు. బాపు మృతితో ఓ ధ్రువతార నేలరాలిందని ఆయన అన్నారు.

ప్రముఖ దర్సకుడు బాపు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, మోహన్ బాబు, ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు తదితరులు సంతాపం ప్రకటించారు. బాపు దర్సకత్వం వహించిన సినిమాలో నటించడం తన పూర్వజన్మ సుకృతమని బాలకృష్ణ అన్నారు. భారత చలనచిత్ర సీమ గొప్ప దర్సకుడిని కోల్పోయిందని రాఘవేంద్ర రావు అన్నారు.
జపాన్లో ఉన్న బాపు కుమారుడు రేపు సోమవారం భారత్ చేరుకుంటారని బంధువులు తెలిపారు. బాపు భౌతిక కాయాన్ని మలర్ ఆస్పత్రి నుంచి చెన్నైలోని అన్నామలైపురంలో గల ఆయన స్వగృహానికి తరలించారు.


Click it and Unblock the Notifications