చిరంజీవి 150వ చిత్రానికి రాజకీయ బ్రేక్ లు
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి 150వ చిత్రానికి ముహూర్తం కుదరడం లేదు. ఆయన సినిమాకు రాజకీయాల వల్ల బ్రేక్లు పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల వల్ల అది అనుకున్న సమయానికి ప్రారంభమయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, వైయస్ జగన్ వ్యవహారం నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలున్నట్లు అంచనాలు సాగుతున్నాయి. దీంతో చిరంజీవి పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో సీమాంధ్రలో తనకు విశేష ఆదరణ లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. దీంతో కలిసి వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పార్టీకి ప్రాణం పోయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు సినిమాను కొంత కాలం వాయిదా వేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











