విషాదం: హాస్య నటుడు కొండవలస మృతి
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు(69) అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు.
అమీర్పేట ఎల్లారెడ్డిగూడ సమీపంలోని నాగార్జుననగర్లో నివాసం ఉంటున్న ఆయన రాత్రి 8 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.ఆయన మృతితో సినీ పరిశ్రమ మరో హాస్యనటుడ్ని కోల్పోయింది.

కొండవలస మరణ వార్త తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రం ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశారు.ఆ సినిమాలో పొట్రాజుగా కొండవలస నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'నేనొప్పుకోను.. ఐతే ఓకే' అనే వూతపదంతో నవ్వుల్ని పంచారు. ఇక ఆ తరవాత.. కొండవలస వెనక్కి తిరిగి చూసుకోలేదు.
'ఇండియన్ గ్యాస్' అనే నాటికలో తన శ్రీకాకుళం మాండలికంలో డైలాగులు పలికారు. ఆ విధానం అప్పట్లో అందరికీ నచ్చింది. అదే తీరును ఆయన సినిమాల్లో తన పాత్రలకు అన్వయించుకున్నారు.

కబడ్డీ కబడ్డీ, ఒట్టేసి చెబుతున్నా, దొంగరాముడు అండ్ పార్టీ, సత్యం, పల్లకిలో పెళ్లి కూతురు, దొంగ దొంగది, రాధాగోపాళం, వీరభద్ర, అందరివాడు, కాంచనమాల కేబుల్ టీవీ, ఎవడిగోల వాడిదే, అందాల రాముడు, బాస్, సైనికుడు, రాఖీ, అత్తిలి సత్తిబాబు, అల్లరే అల్లరి, సుందరకాండ, బ్లేడు బాబ్జీ, గోపి.. గోపిక గోదావరి, బెండు అప్పారావు ఆర్.ఎం.పీ, సరదాగా కాసేపు, అదుర్స్, వరుడు, కత్తి కాంతారావు.. ఇలా వరుస చిత్రాలతో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











