వివాదాల 'టాలీవుడ్'
టాలీవుడ్ లో ఏదైనా కొత్త సినిమా విడుదలయిందంటే చాలు అందులోని లోపాలను ఎత్తి చూపడం వీలయితే ఎదో ఒక వివాదాన్ని సృష్టించేయడం, ఇంకా అవకాశం వుంటే కేసు వేసి కోర్టుకు ఎక్కడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. భారతదేశంలో మార్కెట్ పరంగా అతిపెద్ద సినీపరిశ్రమగా వెలుగొందుతున్న బాలీవుడ్ ను అధికమించే ప్రయత్నంలో వున్న టాలీవుడ్, బాలీవుడ్ లో సర్వసాధారణమయిన వివాదాలను సృష్టించడాన్ని కూడా పునికి పుచ్చుకొంటోంది. దీనికి నిదర్శనమే ప్రస్తుత 'మగధీర', 'మహాత్మ' చిత్రాలు. బాలీవుడ్ లో అయితే విడుదలయిన ప్రతి చిత్రానికీ ఎదో ఒక వివాదాన్ని అంటగట్టి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. గతంలో వచ్చిన 'ఫనా', 'జోధా అక్బర్', 'ధూమ్-2' చిత్రాలకు వివాదాల వల్ల వచ్చిన పబ్లిసిటీ, తద్వారా వచ్చిన లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలయిన 'లవ్ ఆజ్ కల్', 'ఫ్యాషన్' చిత్రాలు కూడా ఈ వివాదాల వల్లనే ఎన్నో కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి.
ఇప్పుడు టాలీవుడ్ లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. రికార్డు స్థాయి కలెక్షన్లతో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసిన మగధీర సినిమా అయితే అంతే రికార్డు స్థాయిలో వివాదాల్లో చిక్కుకొంది. ఈ కథ తనదేనంటూ ఎక్కడో ఆస్ట్రేలియాలో వుంటున్న ఎస్పీ చారి గొడవ చేయడం, దీనికి మీడియా దేశంలో అసలు ఏ సమస్యలూ లేనట్టు అన్నిటినీ గాలికొదిలేసి ఈ వివాదానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఆ తర్వాత అక్కడెక్కడో వున్న వారు గొడవ చేస్తే నేనెందుకు ఊరుకోవాలని వంగపండు ఈ సినిమాలోని 'ఏం పిల్లడో ఎళ్దాం వస్తవా' అనే పాట తనదేనని, తన అనుమతి లేకుండా వాడుకున్నందుకు పరిహారం చెల్లించాలని ప్రకటించి అందరిలోనూ అపహాస్యపాలయ్యాడు. దీన్ని కూడా మీడియా వదల్లేదు. ఇలా చెబుతూ పోతే మగధీర సినిమా గురించిన వివాదాలు కోకొల్లలు. కానీ వివాదాలన్నీ సినిమా వసూల్లు పెరగటానికి ఉపయోగపడినవే.
ఇక తాజాగా శ్రీకాంత్ వందవ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహాత్మ' చిత్రాన్ని కూడా ఈ వివాదాలు వదల్లేదు. అసలు సినిమాను అక్టోబరు 2న విడుదల చెయ్యాలనుకున్నా, విడుదలకు ముందే చెలరేగిన వివాదాల వల్ల పదిరోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదయ్యాక ఈ వివాదాలు కూడా ఎక్కువయ్యాయు. ఈ సినిమాలో తమని అవమానించారని భజరంగ్ దళ్ వారు గొడవ చెయ్యడం, ఆ తర్వాత ఈ సినిమాలో లాయర్ అయిన కథానాయిక ఓ రౌడీని ప్రేమించడం ఏంటని లాయర్లు విమర్శించడం, దీనిపై కోర్టులో కేసు వెయ్యడం లాంటివి ఈ మధ్య మనం తరచూ చదువుతున్న వార్తలు. ఇక ఇలా అయితే కేసులు వేసిన వారే వచ్చి సినిమాలు తీయడం బెటరనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే కానీ జరిగితే నల్లకోటు వెసుకున్న ప్రతి లాయరూ గ్రామ్ ఫోన్ పట్టుకొని యాక్షన్ అనాల్సిందే.
దీనిపై స్పందించిన కృష్ణవంశీ మన దేశంలో ముంబాయ్ దాడుల్లో ప్రధాన నిందుతుడయిన కసబ్ ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నా అలాంటి వారి తరపున వాదించే లాయర్లు వున్నారు. కానీ సినిమాలో హీరోయిన్ అయిన లాయర్ రౌడీని ప్రేమించకూడదా?? ఏం లాయర్లు మాత్రం మనుషులు కాదా అని ఘాటుగా స్పందించాడు. అంతే కాదు ఇటీవలే షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న 'రక్తచరిత్ర' సినిమా గురించి కూడా వివాదాలు సృష్టించేందుకు మీడియా సిద్ధమయిపోతోంది. ప్రముఖ టీవీ ఛానెల్ టీవీ-9 అయితే ఏకంగా దర్శకున్ని ఇంటర్యూ చేసి ఈ సినిమాలో ఎముంటాయి, సమస్యలు ఎదురైతే ఏం చేస్తారు లాంటి అడ్డమయిన ప్రశ్నలతో విసుగెత్తించారు. దేశంలో ఎన్నో సమస్యలుంటే వాటిని వదిలేసి, కేవలం కల్పితాలయిన సినిమాల గురించి పోరాడటం ఎంత వరకూ సబబు. కోర్టులో ఎన్నో కేసులు పెండింగ్ లో పడివుంటే ఇలాంటి అనవసరమయిన కేసులు వేసి విలువైన కోర్టు సమయాన్ని వృథా చెయ్యడం సముచితమేనా??? ఒక్క సారి ఆలోచించండి....


Click it and Unblock the Notifications











