దర్శన్ కు మరోసారి కోర్టు లో చుక్కెదురు.. ఆ స్టార్ హీరో జీవితం జైలుకే అంకితమా..?
ఛాలెంజింగ్ స్టార్గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే దర్శన్ను హత్య కేసులో అరెస్ట్ చేయడం కన్నడ సీమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టించింది. తన ప్రియురాలిని వేధిస్తోన్న రేణుకా స్వామి అనే తన అభిమానిని అత్యంత కిరాతకంగా హతమార్చడం, మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించడం తదితర అభియోగాలపై దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసిస్టెంట్ కెమెరామెన్ స్థాయి నుంచి కన్నడ టాప్ హీరోలలో ఒకరిగా నిలిచి ఛాలెంజింగ్ స్టార్ అనిపించుకున్నారు దర్శన్. సినిమాకు రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ఈయన.. 2003లో విజయలక్ష్మీ అనే మహిళను పెళ్లాడగా.. వీరికో బాబు ఉన్నాడు. అయితే నటి నిఖితతో గతంలో దర్శన్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే పెళ్లియిన 8 ఏళ్లకు దర్శన్ తనను వేధిస్తున్నారంటూ విజయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు హీరోను అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో ఉంచారు.

తర్వాత పవిత్రా గౌడతో దర్శన్ రిలేషన్లో ఉన్నట్లుగా గాసిప్స్ మొదలయ్యాయి. నటిగా, ఫ్యాషన్ డిజైనర్గా పేరున్న పవిత్రకు గతంలోనే పెళ్లయి, కుమార్తె కూడా ఉంది. అయితే మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోగా.. దర్శన్కు దగ్గరై ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితో దిగిన ఫోటోలను పవిత్ర గౌడ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఈ క్రమంలో రేణుకా స్వామి అనే డైహార్డ్ దర్శన్ ఫ్యాన్ వాటిని తట్టుకోలేకపోయాడు. తన అభిమాన హీరోకు, అతని భార్యకు పవిత్ర అన్యాయం చేస్తోందని.. వారి సంసారం నాశనం చేసింది బహిరంగంగా కామెంట్స్ చేసేవాడు.
ఈ కక్షతో పవిత్ర గౌడ సోషల్ మీడియా ఖాతాకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపడం .. వ్యవహారం దర్శన్ వరకు వెళ్లడంతో రేణుకా స్వామిని హత్య చేయాలని పథకం రెడీ అయ్యింది. చిత్రదుర్గలో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరు పట్టణగెరెలో ఉన్న షెడ్లో హత్యకు ముందు అతనికి కరెంట్ షాకిచ్చి, చిత్రహింసలు పెట్టారని.. వాటిని పవిత్ర గౌడ కళ్లారా చూసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. శరీరంపై గాయాలు, మర్మావయవాలు పూర్తిగా దెబ్బతినడం, ఒక చెవి కూడా కనిపించకపోవడాన్ని బట్టి రేణుకా స్వామిని దర్శన్ అతని అనుచరులు ఎంతటా టార్చర్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఈ కేసులో దర్శన్ను అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీగా ఉన్నారు. పలుమార్లు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్ట్ తిరస్కరించింది. ఇటీవల రేణుకా స్వామి హత్య కేసు నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆగస్ట్ 14 వరకు నిందితుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
హత్య కేసులో సాక్ష్యాధారాలు నాశనం చేసేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించారని, అలాంటిది వీరికి బెయిల్ వస్తే విచారణకు ఆటంకం కలిగిస్తారని పోలీసులు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలపై ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ తిరస్కరించారు. ఈ పరిణామాలతో మా హీరో అసలు బయటకు వస్తారా.. లేదంటే సెంట్రల్ జైలుకే పరిమితం అవుతారా అంటూ దర్శన్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











