మా వంశం ఏమైనా తక్కువా? రంగంలోకి రామానాయుడు!
హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో బలంగా పాతుకు పోయిన మెగా, నందమూరి, అక్కినేని, మంచు, ఘట్టమనేని ఫ్యామిలీలు తమ ప్రాభవం చాటు కోవడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయత్నాలతో ముందుకు సాగుతున్నారు. నిన్న మొన్నటి వరకు పోటీ పడి తమ ఫ్యామిలీల నుంచి వారసులను సినీ రంగంలోకి దింపిన వైనాన్ని ఇప్పటి వరకు చూసాం.
ప్రస్తుతం టాలీవుడ్లో సరికొత్త ట్రెండు మొదలైంది. మల్టీస్టారర్ల శకం మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే పలు మల్టీ స్టారర్ చిత్రాలు తెరకెక్కి విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కినేని, మంచు వంశీయులు......అంతా కట్టకట్టుకుని ఒకే సినిమాలో నటిస్తూ ఫ్యామిలీ మల్టీస్టార్లు మొదలు పెట్టారు.
'మనం' పేరుతో అక్కినేని మూడు తరాల హీరోలు నటిస్తున్న సినిమా తెరకెక్కుతుండగా....మంచు ఫ్యామిలీ హీరోలైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్లతో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా దగ్గుబాటి వంశం నుంచి కూడా ఓ మల్టీ స్టారర్ సినిమా మొదలు కానుంది.
దగ్గుబాటి వంశం మల్టీ స్టారర్ చిత్రంలో.... రామానాయుడు, వెంకటేష్, రానా మరియు రామానాయుడు కూతురు కొడుకైన నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన పాత్రలలో నటిస్తారు. ఇందులో సురేష్ బాబు చిన్న కొడుకు అభిరాం ఒక చిన్న పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. వచ్చే యేడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











