రిలీజ్ కాకుండానే ‘ఢమరుకం’ పైరసీ డీవీడీ
హైదరాబాద్ :'ఢమరుకం' విడుదల వాయిదాల విషయంలోనే కాకుండా పైరీసీ విషయంలోనూ రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కాకుండానే పైరసీ డీవీడి అంటూ మార్కెట్లో కనిపించి షాక్ ఇచ్చింది. అయితే ఖచ్చితంగా నవంబర్ 10 కి విడుదల అవుతుంది అనుకున్న పైరసీదారులు, ఈ చిత్రం పోస్టర్ ని,మిగతా సినిమాల పోస్టర్స్ తో కలిపి డీవిడీ కవర్ రెడీ చేసేసారు. అయితే దురదృష్టవశాత్తు ఈ చిత్రం రిలీజ్ కాలేదు. కానీ పైరీసీ కోసం ముద్రించిన కవర్లులో మిగతా సినిమాలు వేసుకుని డీవిడీలు దిగిపోయాయి. అయితే ట్విస్టు ఏమిటంటే కొందరు ఈ చిత్రం దీపావళికి రిలీజ్ అయిపోయిందనుకుని ఈ పైరసీ సినిమాలను ఎంకరేజ్ చేయటమే. ఇలా పైరసీ సినిమాలు కొనే వారికి ఇలా 'ఢమరుకం'బుద్ది చెప్పినట్లైంది.
'ఢమరుకం'కథ ఏమిటంటే...తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్రాజ్ కనిపిస్తారు.
తొలిసారి సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్న నాగార్జున 'డమరుకం' పై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన ఈ చిత్రంలో హైలెట్స్ గురించి చెపుతూ... కథ బాగా నచ్చింది. నాకు స్వతహాగా 'మమ్మీ' 'యుగాంతం'లాంటి గ్రాఫిక్స్ హంగులున్న హాలీవుడ్ సినిమాలంటే ఇష్టం. అలాంటి సినిమాలు బాగా చూస్తాను. 'డమరుకం' కథ చెప్పినప్పుడు ఆ సినిమాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇక గ్రాఫిక్స్పరంగా తెలుగు సినిమాల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. 'మగధీర'ను మించిన గ్రాఫిక్స్ వుంటాయి. ఇలాంటి గ్రాఫిక్స్ ప్రధాన చిత్రాల్లో నటించడం అంత సులువు కాదు. చిన్న రూమ్లో నాతో ఓ సీన్ తీశారు. దాన్ని బ్లూమ్యాట్లో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో చూపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మన ముందులేని పాత్రల్ని ఊహించుకొని అభినయించడం కష్టమైన విషయం. 'డమరుకం'లో అలాంటి సన్నివేశాలు చాలా చేశాను. 'ఈగ' సినిమాలో కూడా సుదీప్ అలానే అభినయించాడు అన్నారు.
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇండియన్ స్క్రీన్పై ముందెన్నడూ చూడని విధంగా గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూడొచ్చని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చెప్పారు. నాగార్జున కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా వెంకట్ అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.


Click it and Unblock the Notifications











