కమిటీలో నేనుంటే నాగార్జునకే దక్కేలా చేస్తా: దాసరి
హైదరాబాద్: ఊపిరి మూవీ థాంక్స్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి నారాయణరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాగార్జున పెర్ఫార్మెన్స్ను పొగిడేసిన ఆయన తాను ఏ అవార్డుల కమిటీలో ఉన్నా సరే.. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును మరో ఆలోచన లేకుండా అక్కినేని నాగార్జునకే దక్కేలా చేస్తాను అన్నారు.
పదిహేను సంవత్సరాల క్రితం బొమ్మరిల్లు సినిమా చూశాను. దాని తర్వాత నేను ఇంత వరకు ఒక గొప్ప సినిమాను చూసుంటే అది కేవలం ఊపిరి మాత్రమే. మన తెలుగు వారు గొప్ప చిత్రం చేయగలరని నిరూపించిన చిత్రమిది. ఈ సినిమా తీయడానికి గట్స్ చూపించిన పివిపిని అభినందిస్తున్నాను.

కుర్చీలో కూర్చొని నటించడానికి సాధారణంగా ఏ కమర్షియల్ హీరో ఒప్పుకోడు. ఒక ఆర్టిస్ట్ కు కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోపెట్టినందుకు వంశీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నాకు నాగార్జున కళ్లంటే ఇష్టం. నా మజ్ను సినిమా తర్వాత నాగార్జున కళ్లను ఎవరూ వాడుకోలేదు. కానీ ఇప్పుడు వంశీ వాడుకున్నాడు. కళ్లతో నటించడం అంటే సులభం కాదు. నటనలో పరిపక్వత వచ్చిన వారు మాత్రమే చేయగలరు అన్నారు.
నాగార్జునగారు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇదంతా నాగేశ్వరరావుగారి నుండి వచ్చినదే. ఒక నటుడు వేయాల్సిన వైవిధ్యమైన పాత్రలన్నింటినీ ఆయన చేసేశారు. అదే వైవిధ్యమే నాగార్జునలో కనిపిస్తుంది. దర్శకుడు వంశీ నిజమైన హీరో. సినిమాను ఎంతో అద్భుతంగా తీశాడు. ప్రతి సీన్ ను డిఫరెంట్ తీశాడు. కార్తీ తప్ప ఆ పాత్రను ఎవరూ చేయలేరు. పదిహేనేళ్ల తర్వాత నేను చూసిన గొప్ప సినిమా ఇది. హిట్ సినిమా, మంచి సినిమాను కలిపితేనే గొప్ప సినిమా అవుతుంది. అలా ఊపిరి గొప్ప సినిమాగా నిలిచిపోయింది అన్నారు.


Click it and Unblock the Notifications











