ఫన్... ఎమోషన్ ('ఎర్ర బస్సు' ప్రివ్యూ)
హైదరాబాద్: ఒకప్పుడు స్టార్ హీరోలతో చేసిన దాసరి నారాయణ రావు చిత్రాలకు మంచి క్రేజ్ ఉండేది. ముఖ్యంగా కథ ప్రధాన చిత్రాలు తీస్తూ వాటిల్లో భావోద్వేగాలను ఎలివేట్ చేస్తూ కథనం నడిపించటం ఆయన ప్రత్యేకత. అయితే సినిమాల పరంగా ఆయన ఈ మధ్యకాలంలో బాగా వెనక పడ్డారనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలేవీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. ముఖ్యంగా బాలకృష్ణ తో చేసిన పరమ వీర చక్ర చిత్రం ఫెయిల్యూర్ తో బాగా విమర్శలు పాలయ్యారు. ఈ నేపధ్యంలో ఆయన రూపొందించి ఈ రోజు విడుదల చేస్తున్న ఈ తాజా చిత్రంపై అందరి దృష్టీ ఉంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'మన్జపాయ్' చిత్రానికి ఇది తెలుగు రూపం. బాలల దినోత్సవ కానుకగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 509 థియేటర్లలో సినిమా రిలీజవుతోంది.
చదువుకోని పల్లెటూరి తాతకి, అమెరికాకి వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ మనవడికి మధ్య జరిగే కథ ఇది. తాతని హ్యాపీగా ఉంచాలని హైదరాబాద్ తీసుకొచ్చిన మనవడికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయనేది ఆసక్తికరం. కథలో నారాయణస్వామి(దాసరి) ఓ పల్లెటూరి మనిషి. ఆయన మనవడు(మంచు విష్ణు)కి మాత్రం అమెరికా వెళ్లాలనేది లక్ష్యం. చిన్నప్పట్నుంచి తనకి ఓ స్నేహితుడిలా ఉంటూ వచ్చిన తాతయ్యని మూడు నెలల పాటు బాగా సంతోష పెట్టాలని హైదరాబాద్ తీసుకొస్తాడు. ఆ మూడు నెలల కాలంలో ఏం జరిగింది? తాతయ్య మనవడి కోసం ఏం చేశాడు? సిటీకి వచ్చిన పల్లెటూరి తాతయ్య ఎడ్జెస్ట్ అయ్యారా... ఏం సమస్యలు వ్చచాయి...తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే.
విమల్, లక్ష్మీ మీనన్, రాజ్కిరణ్ ప్రధాన పాత్రల్లో తమిళంలో తెరకెక్కిన చిత్రం మంజాపై. ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్, సర్కునమ్ సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ ఏడాది జూన్లో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్ర రీమేక్ హక్కులను సౌభాగ్య మీడియా లిమిటెడ్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ పంజాబీ, రాజస్తానీ, సింధి, భోజ్పురీ, ఒరియా..ఇలా ఉత్తారాదికి చెందిన అన్ని భాషల్లోనూ పునర్నిర్మాణ హక్కులు సౌభాగ్య మీడియా సొంతం చేసుకుంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల మేళవింపుతో రూపొందింది.
ఇందులో పల్లెటూరు నుంచి వచ్చే అమాయక తాత పాత్రను దాసరి పోషిస్తుండగా, ఆయన మనవడి పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నారు.
దాసరి మాట్లాడుతూ ''తాతమనవళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే చిత్రమిది. కుటుంబమంతా కలిసి చూసేలా తీర్చిదిద్దాను. సెంటిమెంట్తో పాటు వినోదానికీ ప్రాధాన్యముంది. విష్ణు ఉత్తమ నటనను కనబరిచాడు. 'ఎర్రబస్సు' అనే పేరును ఒక గుర్తుగా వాడాం. ఎర్రబస్సు ఎక్కినోళ్లు ఎంత గట్టివాళ్లు అనే విషయం అంతర్లీనంగా అర్థమవుతుంటుంది'' అన్నారు. ''ఇదొక అందమైన కథతో తెరకెక్కిన చిత్రం'' అన్నారు మంచు విష్ణు.

బ్యానర్: తారకప్రభు ఫిలిమ్స్
నటీనటులు: మంచు విష్ణు, కేథరిన్, దాసరి నారాయణరావు నాజర్, బ్రహ్మానందం, అలీ, కృష్ణుడు, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, సూర్య, రవిప్రకాష్, మెల్కోటె, ప్రభాస్ శ్రీను, దీక్షిత్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కాదంబరి కిరణ్, సారిక రామచంద్రరావు, సిద్ధార్థ, హేమ, సురేఖవాణి, విష్ణుప్రియ, అనితానాథ్, మౌనిక, బేబీ నీరాజిత తదితరులు.
కథ: ఎన్.రాఘవన్,
రచన: రాజేంద్రకుమార్,
పాటలు: డా.దాసరి నారాయణరావు, డా.సుద్దాల అశోక్తేజ, భాస్కరభట్ల, కరుణాకర్,
సంగీతం: చక్రి,
కెమెరా: అంజి,
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి),
ఆర్ట్: బి.వెంకటేశ్వరరావు,
డాన్స్: డా.శివశంకర్, స్వర్ణ, దినేష్,
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్,
సెకండ్ యూనిట్ డైరక్టర్: రేలంగి నరసింహారావు,
నిర్మాత, స్ర్కీన్ప్లే, మాటలు, దర్శకత్వం: డా.దాసరి నారాయణరావు.
విడుదల తేదీ: 14,నవంబర్ 2014.


Click it and Unblock the Notifications











