సెన్సార్ బోర్డులో రాజకీయ నిరుద్యోగులు: దాసరి
హైదరాబాద్: సెన్సార్ బోర్డులో రాజకీయ నిరుద్యోగులను పెట్టి ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తోందని దర్శక రత్న దాసరి నారయణరావు తీవ్రంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం 'విశ్వరూపం' చిత్రం ప్రెస్ మీట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.... ఆయన గొప్ప నటుడు, ఆయన దేశం విడిచి వెళానని చెప్పడం నన్ను ఎంతో బాధించింది. తమిళ ప్రజలు, ఈ దేశం ఆయన్ను కాదనుకోదు అని చెప్పుకొచ్చారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సినిమాను ఆపే శక్తి ఎవరికీ లేదని, శాంతి భ్రదతలు కాపాడు కోవడం ప్రభుత్వం బాధ్యత. అవసరం అయితే కేంద్ర బలగాలను తెప్పించుకోవాలి. అంతే కానీ రాజకీయ కారణాలతో సినిమాల ప్రదర్శన ఆపడం అన్యాయమని దాసరి వ్యాఖ్యానించారు.
దాసరి నారాయణరావుకు చెందిన సిరి మీడియా విశ్వరూపం చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న విషయం తెలిసిందే. విశ్వరూపం చిత్రం తెలుగులో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తాజ్ బంజారాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
అదే విధంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మాట్లాడుతూ... కమల్ హాసన్ సినిమా వివాదం కావడం అన్యాయం. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా సెన్సార్ అయ్యాక ఆపడం సబబు కాదు అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











