తెలంగాణ వచ్చేసింది కాబట్టి...: దిల్ రాజు
హైదరాబాద్ : " తెలంగాణ ఉద్యమ కాలంలో ఇండస్ట్రీలో కొంత డిస్టర్బెన్స్ జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్సులూ లేకుండా చూడాలి '' అని దిల్ రాజు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో దర్శకుడు ఎన్. శంకర్ రూపొందించిన 'జై బోలో తెలంగాణ' సినిమా విజయోత్సవ కార్యక్రమం సోమవారం తెలుగు నిర్మాతల మండలి హాలులో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రసీమ, రాజకీయ ప్రముఖులు పలువురు పాల్గొని తెలుగు చిత్రసీమ వర్తమానం, భవితవ్యంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అలాగే ఎలాంటి గాడ్ఫాదర్ లేకుండా పన్నెండేళ్ల నుంచీ స్వయంకృషితో ఎదుగుతూ వచ్చా. నేనెప్పుడూ ఇక్కడ వివక్షను ఎదుర్కోలేదు. తెలంగాణవాడిగా నన్ను మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. సినిమాల్లో అడుగు ముందుకెయ్యాలంటే డబ్బు కావాలి. ప్రేక్షకులకి సినిమా నచ్చకపోతే ఉచితంగా చూపిస్తామన్నా చూడరు. నచ్చితేనే చూస్తారు. చెయ్యాల్సింది ప్రేక్షకుడికి నచ్చేలా తీయడం. ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలో మార్పు రావాలంటే సాధ్యం కాదు. మార్పు రావడం కోసం కృషి కొనసాగించాలి అని దిల్ రాజు అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ "నాకు కులభేదం, భాషాభేదం, ప్రాంతీయభేదం లేవు. అందరూ మనుషులే. మీరు, మేం అనే వాటిని కాక 'మనం' అనేదాన్ని నమ్ముతాను. తెలంగాణలో గొప్ప నాయకులున్నారు. గొప్ప ప్రతిభ ఉంది. నేను 'జై బోలో తెలంగాణ' చేస్తున్నప్పుడు ఆంధ్రవాడు తెలంగాణ సినిమా చెయ్యడమేంటని అన్నవాళ్లున్నారు. కొందరు ఫోన్లో బెదిరించారు. అయినా చేశాను. ఇరవై, ముప్పై వేల మంది తెలంగాణవాళ్ల మధ్య షూటింగ్ చేశాను. వాళ్లెవరూ నన్ను ఒక్కమాటా అనలేదు. ఇది గొప్ప సినిమా. ఈ సినిమా చేయడం శంకర్కు పెద్ద ఛాలెంజ్. మ్యాపుల్లో గీతలు పడొచ్చుకానీ, మనసుల్లో మచ్చలు పడకూడదు'' అని చెప్పారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ 'జై బోలో తెలంగాణ' సినిమా తీసి మూడేళ్లు దాటిందనీ, అసమానతలు లేని తెలంగాణను సాధించడానికి ప్రయత్నించాలనీ, మానవ సంబంధాలు తెగిపోకూడదనీ ఆ సినిమాలో చెప్పాననీ తెలిపారు. ఏ ప్రాంతంలోనైనా దోపిడీకి గురయ్యేవారి ఆవేదన ఒకేలా ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications











