టైటిల్ మార్చమంటే కోర్టుకైళతానంటూ దర్శకుడు
ముంబై: 'పేరు మార్చమంటే నేను కోర్టుకైనా వెళ్లడానికి సిద్ధం. ప్రపంచ దేశాల్లో భారత దేశానికి పర్యాటకంగా 'ల్యాండ్ ఆఫ్ కామసూత్ర'గానే మంచి పేరుంది. అలాంటిది ఆ పేరే మార్చాలంటే ఎలా ఒప్పుకుంటాం?' అంటున్నారు 'కామసూత్ర త్రీడీ' దర్శకుడు రూపేష్ లాల్. జీజే ఎంటర్టైన్మెంట్ సంస్థపై జార్జ్ జాన్, సోహన్ రాయ్తో కలిసి పాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా పేరును మార్చాలని సెన్సార్ వాళ్లు కోరితే అనే ప్రశ్నకు మాత్రం దర్శకుడు పై విధంగా ఘాటుగానే స్పందిస్తున్నారు.
చిత్రం కథ గురించి నటి షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ..... 'ఇదొక అద్భుతమైన ప్రేమ కథ. భారతదేశానికి చెందిన ఓ రాణి తన భర్త కోసం అన్వేషిస్తూ సముద్రయానం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె తన భర్తను కనిపెట్టిందా? ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంది? అనేదే కథ. ఈ సినిమా నాతో పాటు ప్రేక్షకుల్ని కూడా సముద్రయానానికి తీసుకెళ్లడం ఖాయం. వారంతా సినిమా చూస్తున్నంతసేపూ నాతోపాటు ప్రయాణం చేస్తారు. నా తనువు, మనసు పొందే అనుభూతిని కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తారు' అంటోందామె.

ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ఇఫి (అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం) వేడుకల్లో ఇటీవలే విడుదల చేశారు. ఇందులో షెర్లిన్ చోప్రా ఎలా కనిపించింది, ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకుందా లేదా అనే విషయాలను పక్కన పెడితే దీన్ని వచ్చే ఏడాది జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి పంపనున్నారు. ఇప్పటికే మార్కెట్ పరంగా ఈ సినిమాపై చాలా మంది ఉత్సుకత చూపుతున్నారని దర్శకుడు ఆనందపడుతున్నారు.
'ఈ సినిమాను రెండు వెర్షన్లుగా విడుదల చేస్తాం. భారతీయ ప్రేక్షకుల కోసం ఒకటైతే, ప్రపంచ ప్రేక్షకుల కోసం మరొకటి. ఇప్పటికే ఆసియా, యూరప్, అమెరికాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని అమ్మేశాం కూడా' అంటున్నారు. ప్రచార చిత్రాన్ని చూసినవాళ్లంతా ఈ సినిమాపై 'పైరేట్స్ ఆఫ్ కరీబియన్', '300' తదితర హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఉందంటున్నారు.
సినిమా విషయంలో షెర్లిన్ అందించిన సహకారం గురించి కూడా దర్శకుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా ఏడాదిన్నర ఆలస్యమైంది. అయితే ఏ సందర్భంలోనైనా తన సహకారాన్ని ఒకే విధంగా కనబరిచి సినిమా ఇప్పటికైనా పూర్తి కావడానికి సహకరించిన ఒకే ఒక వ్యక్తి షెర్లిన్ చోప్రా అంటున్నారు.


Click it and Unblock the Notifications











