రవిబాబు 'అవును'కథ ఏంటి?
ఇక ఈ చిత్రం చేయటానికి ప్రేరణ గురించి చెపుతూ..ప్రతి మనిషికీ భయం అనేది ఉంటుంది. నిజానికి భయపడుతూ బతకడం అనేది అందరికీ చిరాకే. అయితే ఆ భావోద్వేగాన్ని టిక్కెట్ కొనుక్కొని మరీ పొందేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టే ఇంతకు ముందు 'అనసూయ' చేశాను. ఇప్పుడు 'అవును' సిద్ధం చేశాను. హారర్ సినిమా అనగానే చీకటినే ఎక్కువగా వాడుకొంటూ ఉంటారు. ప్రధాన పాత్రధారి నిద్రకు ఉపక్రమించగానో, చీకట్లో నడచి వస్తుంటేనో ఆత్మ ఆవహిస్తూ ఉంటుంది. చాలా సాధారణంగా మనం కథల్లో చదివినా, సినిమాల్లో చూసినా కాస్త అటూఇటూగా సన్నివేశాలు ఇలాగే కనిపిస్తాయి. ఈ కథ అనుకొన్నప్పుడు నాకో సందేహం కలిగింది.. 'దెయ్యాలు, ఆత్మలూ రాత్రిపూటే సంచరిస్తున్నట్లు విన్నాం. చదివాం. మరి పగలంతా అవేం చేస్తుంటాయి?' అని! ఆ ప్రశ్న నుంచి సన్నివేశాలు పుట్టుకొచ్చాయి అన్నారు.
'అవును'చిత్రం ప్రత్యేకత చెపుతూ...ఈ చిత్రంలో చీకటి నేపథ్యం లేదు. ఆత్మలు పగలే, మంచి కాంతివంతమైన వాతావరణంలో కంగారు పుట్టిస్తాయి. భయపడటం కూడా వినోదంలో భాగమే. వంద మంది మధ్యలో కూర్చొని కూడా... తెరపైన సన్నివేశాలకు అనుగుణంగా స్పందిస్తూ భయపడటం... థియేటర్ బయటకు వచ్చాక దాని గురించి మాట్లాడుకోవడం సరదాగా అనిపిస్తుంది. అందుకే థ్రిల్లర్, హారర్ తరహా చిత్రాలకు ఆదరణ ఉంటోంది అన్నారు.
అలాగే హర్రర్ సినిమాల్లో వికృతమైన హావభావాలు, కంటికి ఇబ్బంది కలిగించే కెమెరా కదలికలూ ఎక్కువగా ఉంటాయి. ప్రేక్షకుల్ని ఏదో రీతిన సీటు అంచుకు తీసుకొచ్చి కంగారుపెట్టాలి. అందుకోసం పలు మార్గాల్లో సన్నివేశాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తుంటారు. మా చిత్రంలో మాత్రం ఆ ధోరణి లేదు. కెమెరాను స్టడీగానే ఉంచాం. కెమెరాను అటూఇటూ తిప్పడం, పైకీకిందికీ ఆడించడం లాంటివి చేయలేదు. ఫలితంగా నటుల మీద భారం ఎక్కువైంది. ఈ చిత్రంలో కథను రక్తికట్టించడంలో ఛాయాగ్రాహకుడు సుధాకర్రెడ్డి, సంగీత దర్శకుడు శేఖర్చంద్రలు కీలక పాత్రలు పోషించారు అని చెప్పారు.
డి.సురేష్బాబు, పి.వి.పి. అధినేత పొట్లూరి వరప్రసాద్, రవిబాబు నిర్మాతలుగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపెై రూపొందిస్తున్న 'అవును' చిత్రం రూపొందుతోంది. పూర్ణ, హర్షవర్ధన్రాణె, ఎవిఎస్ అల్లుడు చక్రవర్తి, భార్గవి, చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి, మాస్టర్ గౌరవ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవిబాబు గత చిత్రాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా చేసిన చిత్రమని అంటున్నారు.


Click it and Unblock the Notifications












