కావాలనే వేలు పెట్టలేదు
హైదరాబాద్: ''ఒక భాషలో సినిమా మరో భాషలోకి పునర్నిర్మితమయ్యేసరికి చాలా మార్పులు చోటు చేసుకొంటాయి. నేటివిటీకి తగ్గట్టుగా కథ, కథనాల్లో కీలక మార్పులు చేస్తుంటారు. అయితే అన్ని సినిమాలకీ అలా అవసరం లేదని నా అభిప్రాయం. 'దృశ్యం'లాంటి కథల్లో అనవసరంగా వేలు పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఒక కుటుంబంలో భావోద్వేగాలు ఎక్కడికెళ్లినా అలాగే ఉంటాయి. అందుకే నేను పెద్దగా మార్పులు చేయలేదు. అదే ఇప్పుడు ఫలితాల్నిచ్చింది'' అంటూ చెప్పుకొచ్చారు దర్శకురాలిగా మారిన నటి శ్రీప్రియ.
నిన్నటిదాకా ఆమె ఓ హీరోయిన్ గా, నటిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఇటీవల వెంకటేష్ హీరోగా 'దృశ్యం' సినిమాని తెరకెక్కించి తనలో మరో కోణం కూడా ఉందని చాటిచెప్పింది. ప్రస్తుతం ఆ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తోంది శ్రీప్రియ. అయితే సినిమాని మక్కికి మక్కీ దింపేసిందని, కొద్దిగా కూడా మార్పులు చేయలేదంటూ విమర్శలు వచ్చాయి. అయితే అది కావాలనే చేసానని, కావాలనే వేలు పెట్టి మార్పులు చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక ''సొంత కథతో సినిమా తీస్తే చాలా సౌలభ్యాలుంటాయి. తప్పయినా ఒప్పయినా ఎవరూ అడగరు. నచ్చితే బాగుందంటారు, లేదంటే బాగోలేదని వెళ్లిపోతారు. అదే రీమేక్ కథని తీస్తే మాత్రం మాతృకతో పోల్చి చూసుకొంటారు. అందులో వంద తప్పులు వెతుకుతారు. కథలో మార్పులు చేస్తే ఒక బాధ, చెయ్యకపోతే మరో బాధ. నా దృష్టిలో రీమేక్ సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకొన్న పని'' అన్నారు శ్రీప్రియ.
వెంకటేష్ ఎంపిక గురించి చెప్తూ...''కుటుంబ కథ అనగానే అందరూ వెంకటేష్ పేరే చెప్పారు. నాకు సన్నిహితులైన జయసుధ, జయప్రద. వాళ్లు కూడా వెంకీ అనే చెప్పారు. దీంతో మరో ఆలోచన లేకుండా ఆయనతోనే సినిమా తెరకెక్కించా. నిజంగా వెంకటేష్తో సినిమా చేయడం చాలా సులభం. ఆయన ఏం చెబితే అది చేశారు. సెట్లో ఆయన నటనను చూసినప్పుడే... నాకు ఎంతో ముచ్చటగా అనిపించేది. ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఆయన తెరపై కనిపించారు. థియేటర్లో సినిమా చూస్తుంటే నాకే కనీళ్లొచ్చాయి. అంత బాగా నటించారు. అందుకే 'దృశ్యం' అంత మంచి విజయాన్ని సొంతం చేసుకొంది'' అన్నారామె.


Click it and Unblock the Notifications











