మరోసారి మానవత్వం ప్రదర్శించిన సుకుమార్.. స్వస్థలం రాజోలులో 40 లక్షలతో!
ఆర్య, 100% లవ్, రంగస్థలం చిత్రాలతో టాలీవుడ్లో అగ్ర దర్శకుడిగా మారిన సుకుమార్ మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఆక్సిజన్ దొరకక బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ తన వంతు ప్రయత్నంగా గోదావరి జిల్లాల ప్రజలకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు.

కోవిడ్ పేషంట్ల అవస్థలు చూసి
కోవిడ్ పాజిటివ్తో బాధపడుతూ ఆక్సిజన్ పడకలు దొరకక పడుతున్న అవస్థలు దర్శకుడు సుకుమార్ని కదిలించాయి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నారు.

రాజోలు గ్రామంలో ఆక్సిజన్ ప్లాంట్
తన స్వస్థలం కాకినాడకు సమీపంలోని రాజోలు గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో డిప్లాయబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేషన్ సిస్టం (DOCS) 80 ఆక్సిజన్ జనరేటర్ సిస్టమ్ ప్లాంట్ నిర్మించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుకుమార్ తీసుకొన్న నిర్ణయంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే కరోనా బాధితులకు అండగా
ఇప్పటికే కోనసీమలోని కరోనా బాధితులకు అండగా నిలిచారు. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందిస్తూ తన వంత మానవ ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. రాజోలులో ప్లాంట్ నిర్మాణం తక్షణమే చేపట్టి నాలుగురోజుల్లో పూర్తిచేసేలా యుద్ద ప్రాతిపదికన ప్రణాళికను సిద్ధం చేశారు.

తొలుత 25 లక్షలతో
దర్శకుడు సుకుమార్ తొలుత రూ.25 లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్నారు. కానీ ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్ తయారుచేసుకోవచ్చన్న ఉద్దేశంతో సుకుమార్ మరో రూ.15 లక్షలు అదనంగా అందించారు. దీంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
Recommended Video

సుకుమార్ ప్రయత్నంపై ప్రశంసలు
రాజోలు ప్రాంతంలో మొత్తం రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మిస్తున్నారు అని సుకుమార్ స్నేహితుడు అమలాపురం పంచాయతీరాజ్ డీఈఈ అన్యం రాంబాబు తెలిపారు. సుకుమార్ సేవాగుణాన్ని టాలీవుడ్ ప్రముఖులతోపాటు కోనసీమ ప్రజలు కూడా అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











