ఆ హీరోలు ఉరి వేసుకుంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు, దానికి కారణం మహేష్ బాబే: తేజ
స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే చాలా టాలెంట్ కావాలి.. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లతో చేసే టాలెంట్ అయితే నాకు లేదు అంటున్నారు దర్శకుడు తేజ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొత్త వాళ్లతో తీయడం ఈజీ, స్టార్లతో తీయాలంటే ఆరు పాటులు, ఆరు ఫైట్లు ఉండాలి... అలా తీయడం నాకు చేతకాదని తెలిపారు.
స్టార్ హీరోల నుంచి జనాలు కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. వారి సినిమాల్లో అది లేకుంటే ఒప్పుకోరు... అలా కాకుండా విభిన్నంగా చేయగలిగే యాక్టర్లు కొంత మందే ఉంటారు. కమల్ హాసన్, హృతిక్ రోషన్, సూర్య లాంటి వారు మాత్రమే కొత్తవి ట్రై చేస్తారు. వాళ్లకు ఓకే కానీ... మిగతా స్టార్ హీరోలంతా ఒక ఫార్మాట్కు అలవాటైపోయారు, ఫ్యాన్స్ కూడా వారిని అలా చూడటానికే ఇష్టపడతారని తేజ అభిప్రాయ పడ్డారు.

మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ఉరి వేసుకుంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు
స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ డే వచ్చేది ఫ్యాన్సే... టాక్ స్రెడ్ చేసేది వాళ్లే. కొత్తగా ట్రై చేశామనుకోండి... రెగ్యులర్ ఫార్మాట్కు అలవాటు పడిపోయిన అభిమానులకు నచ్చదు. దీంతో సినిమా ఫెయిల్ అవుతుంది. ఉదాహరణకు ‘నేనే రాజు నేనే మంత్రి'లో హీరో చివరకు భార్య కోసం ఊరేసుకుని చచ్చిపోతాడు. మహేష్ బాబును అందులో ఊహించుకుంటే వర్కౌట్ అవుతుందా? ఫ్యాన్స్ ఒప్పుకోరు. జూ ఎన్టీఆర్ ఉరేసుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. రానా కూడా ఒక స్టారే.. కానీ ఫ్యాన్ ఫీడింగ్ ఇమేజ్ లేదు. వాళ్లకు అది ఉంది కాబట్టి వాళ్లతో ఇటువంటి ప్రయోగాలు చేయలేను... అని తేజ తెలిపారు.

మనం వారికి కొన్ని అలవాటు చేశాం
ఆడియన్స్ ఆరు పాటలు, ఆరు ఫైట్లు ఉన్న సినిమాలు చూస్తారు, ఎక్స్ రేటెడ్ సినిమాలు, బూతు మాట్లాడే సినిమాలు చూస్తారు, వారికి అన్నీ కావాలి. కానీ మనం వారికి కొన్ని అలవాటు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తేజ తెలిపారు.

రైటు, రాంగ్ అని ఏమీ ఉండదు
మనం పచ్చడి తింటాం. కూర తింటాం.. సాంబర్ తింటాం. పుల్లగా ఉండే పులుసు తింటాం, స్వీటు తింటాం. హాటు తింటాం. అన్ని రకాలు తింటాం. మనిషి అనేవాడికి అన్ని రకాల టేస్టులు కావాలి. సినిమాల్లో కూడా అన్ని రకాలు చూస్తారు. ఒక ఫిల్మ్ మేకర్గా నేను ఏది తీయగలను, ఏది కరెక్టుగా ఇవ్వగలను? అనేది ముఖ్యం. ఇది రైట్ సినిమా, ఇది రాంగ్ సినిమా అని ఏమీ ఉండదు.

మహేష్ బాబు ఇమేజ్ వల్లే ‘నిజం' ఆడలేదు
‘నిజం' మూవీ మహేష్ బాబు ఇమేజ్ వల్ల వర్కౌట్ కాలేదు. అంతకు ముందు ‘ఒక్కడు' మూవీ రావడం వల్ల మహేష్ బాబు ఇమేజ్ పెరిగింది. ఆ లెవల్ కు ‘నిజం' లేదు. చిరంజీవిగారు ఆపద్భాంధవుడు అని చేశారు. ఆయనది మాస్ ఇమేజ్ కావడం వల్ల అది ఆడలేదు. చంటబ్బాయి అనే సినిమా కూడా ఇప్పటికీ టీవీలో చూస్తే బావుంటుంది. ఆయన ఇమేజికి తగిన విధంగా లేదు కాబట్టి ఆడలేదని తేజ తెలిపారు.

గొడవలు నిజం కాదు
మహేష్ బాబు గారితో నిజం సినిమా సమయంలో గొడవ జరిగింది అనే విషయంలో నిజం లేదు. నిజం తర్వాత అన్నీ ప్లాపులే వచ్చాయి. అలాంటపుడు స్టార్ హీరోలు ఎందుకు చేస్తారు? ‘నేనే రాజు నేనే మంత్రి' సినిమా తర్వాత నుంచే మళ్లీ తన కెరీర్ గాడిలో పడిందని తేజ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











