చల్లారని 'దేనికైనా రెడీ'వివాదం
హైదరాబాద్ :మంచు విష్ణు నటించిన'దేనికైనా రెడీ'చిత్రం యాభై రోజులుకు దగ్గరపడుతున్నా వివాదం వేడి మాత్రం తగ్గటం లేదు. తాజాగా దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులను, మహిళలను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని బ్రాహ్మణ సంఘాలు, ధన్వంతరీ ఫౌండేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.నంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేదంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.
మరో ప్రక్క వివాదాస్పదమైన 'దేనికైనా రెడీ' సినిమాకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు మరోమారు వెరీ గుడ్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాను రెండు కమిటీలు పరిశీలించాయని, అభ్యంతరకర దృశ్యాలను తొలగించి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఏకగ్రీవంగా ఆమోదించాయని పేర్కొంది. ఈమేరకు మానవహక్కుల సంఘానికి సెన్సార్బోర్డు వివరణ ఇచ్చింది. సినిమాలోని సన్నివేశాలపై ఆగ్రహించిన బ్రాహ్మణ సంఘాలు హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు బోర్డు అధికారులు తాజాగా నివేదికను అందజేశారు. చిత్రంలోని సన్నివేశాలపై బోర్డు అధికారులు తమదైన శైలిలో వివరణ ఇచ్చారు. సినిమాలో బ్రాహ్మణులకు హలీం ఇస్తున్నట్లు ఓ అమ్మాయి సరదాగా అంటుందని వివరించారు. అలాగే ఆ వర్గానికి చెందిన మహిళను అమాయకురాలిగానే చూపారు తప్ప దురుద్దేశాలేమీ లేవని తేల్చారు.
అంతకుముందు 'దేనికైనా రెడీ' చిత్రం బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉందని, ఆ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను రద్దు చేయాలని, అంతవరకు చిత్ర ప్రదర్శనను నిలిపి వేయాలంటూ సి.రఘునాథరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్, ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి, రివైజింగ్ కమిటీ అధికారి, హీరో మం చు విష్ణువర్ధన్ బాబు, నిర్మాత మోహన్ బాబులకు నోటీసులు జారీచేసింది.
శాకాహారులైన బ్రాహ్మణులు మాంసాహారం కోసం పాకులాడుతున్నట్లు చిత్రంలో చూపారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలా చూపడం సినిమా టోగ్రఫీ చట్టం-1952లోని సెక్షన్ 5ఏ, 5బీలకు వ్యతిరేకమని వివరించారు. ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్బోర్డు సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు..ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications











