నా భార్యకు టీబీ, పెరోల్ గడుపు పెంచండి: సంజయ్ దత్
ముంబై: 1993 ముంబయి పేలుళ్లకు సంబంధించిన కేసులో శిక్ష అనుభవిస్తున్న సినీ నటుడు సంజయ్ దత్ పుణెలోని ఎరవాడ జైలు నుంచి పెరోల్పై విడుదలైన సంగతి తెలిసిందే. భార్య మాన్యత అనారోగ్యంతో ఉన్నారంటూ సంజయ్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని పుణె అధికార యంత్రాంగం డిసెంబరు 6న ఆయనకు నెల రోజుల పెరోల్ను మంజూరు చేసింది.
కాగా...పెరోల్ గడుపు ముగియడంతో మరో 30 రోజుల పాటు గడుపు పొడగించాలని సంజయ్ దత్ దరఖాస్తు చేసుకున్నారు. తన భార్యకు టీబీ వ్యాధి ఉందని నిర్దారణ అయిందని, ఇందుకుగాను గడువు మరింత కాలం పెంచాలని ఆయన కోరారు. ఈ మేరకు మాన్యత హెల్త్ రిపోర్టులను ఆయన సమర్పించారు.
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు.
దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్దత్ కాగిత సంచుల తయారీలో శిక్షణ పొందుతున్నాడు.


Click it and Unblock the Notifications












