ఆయన చిత్రాలు ముందు మా సినిమాలెంత?: ఇవివి
తనలాంటి దర్శకులు ఎన్ని చిత్రాలు తీసినా, కె విశ్వనాథ్ చిత్రం ఒక్కటి చాలని ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ అన్నారు. నరేశ్, మంజరి జంటగా కళాతపస్వి కె విశ్వనాథ్ రూపొందిస్తున్న చిత్రం 'శుభప్రదం' లోగో ఆవిష్కణ సభకు హాజరై ఇలా స్పందించారు. నిర్మాతల మండలి హాలులో జరిగిన కార్యక్రమంలో కె విశ్వనాథ్ స్వయంగా 'శుభప్రదం' లోగోని ఆవిష్కరించారు. అతిథిగా హాజరైన శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ కె విశ్వనాథ్ చిత్రమంటే ప్రేక్షకలోకం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తుంటుందనీ, ఆయన సినీ చరిత్రలో 'శుభప్రదం' మరో కలికితురాయిగా నిలిచిపోతుందనీ అన్నారు. కె విశ్వనాథ్ మాట్లాడుతూ "వేటూరి సాహిత్యం వల్లే నా సినిమాలకి విలువ పెరిగింది. సినిమా తయారుచెయ్యడం వరకే నా వంతు. ఫలితాన్ని భగవంతుడికే వదిలేస్తా. నేను తీసే సినిమాల ఒరవడికి నరేశ్ ఎలా సరిపోతాడని చాలామంది అడిగారు. అయితే 'అల్లరి' నరేశ్ ఈ సినిమాతో 'శుభప్రదం' నరేశ్ గా పేరు తెచ్చుకుంటాడు. మణిశర్మ చాలా చక్కని సంగీతం అందించాడు అని చెప్పారు. శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హరిగోపాల కృష్ణమూర్తి, పీలా నీలతిలక్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిహెచ్. కౌసలేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











