చిరంజీవికి 'ఖైదీ', నాగార్జునకు 'శివ' ఎలాగో..అలాగే
హైదరాబాద్ : " చిరంజీవికి 'ఖైదీ', నాగార్జునకు 'శివ' ఎలా గుర్తుండిపోయాయో హవీష్కు మా 'జీనియస్' అలాగే గుర్తుంటుంది. జీనియస్ చూసి మారామని పలువురు హీరోల అభిమానులు మెసేజ్లు పంపిస్తుంటే ఆనందంతో కళ్ళు చమర్చాయి. నిర్మాతగా ఎన్ని కోట్ల కలెక్షన్లను లెక్క చూసుకున్నా, నేను పొందుతున్న ఆత్మసంతృప్తి ముందు అవన్నీ దిగదుడుపేననిపిస్తోంది. '' అని నిర్మాత దాసరి కిరణ్ అన్నారు. హవీష్ నటించిన 'జీనియస్'కు ఆయన నిర్మాత. ఈ సినిమాను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసి,మాట్లాడారు.
దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ "యువతకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. డైలాగులు, నటన సినిమాకు ప్లస్సయింది. ఫస్ట్ హాఫ్ చూసి కన్ఫ్యూజన్ ఉందని అంటున్నవారు సెకండ్ హాఫ్ చూసి మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్లో అందరికీ ఉన్నది కన్ఫ్యూజన్ కాదు. మేం స్క్రీన్ప్లేను అలా క్రియేట్ చేశాం. విద్యార్థులు జీనియస్ కావాలంటే మా సినిమాను ఒక్కసారైనా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది'' అని చెప్పారు.
హవీష్ మాట్లాడుతూ "మా నాన్నగారు ఈ సినిమా విషయంలో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయనేమీ డబ్బు పెట్టలేదు. ఖర్చంతా దాసరి కిరణ్గారిదే. సమాజానికి ఉపయోగపడే ఈ సినిమాను బాధ్యతగా తీసుకుని చేశాను. కిరణ్గారికి, చిన్నికృష్ణగారికి థాంక్స్ . చిన్నికృష్ణ రాసిన కథ, పరుచూరివారి డైలాగులు అన్నీ సినిమాకు ప్లస్సయ్యాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కు ధన్యవాదాలు చెప్తున్నాం'' అని అన్నారు."జీనియస్లు కావాల్సిన పిల్లలు, తమకు నచ్చిన వారికోసం సమయాన్ని వృథా చేస్తూ, జీవితాన్ని ఎలా పాడుచేసుకుంటున్నారన్న విషయాన్ని చాలా చక్కగా చూపించాం. తప్పక ప్రశంసలు దక్కుతాయని నేను చెప్పిన ప్రతి చోటా ప్రేక్షకులు స్పందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా పలు సినిమాలు వస్తాయి'' అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.


Click it and Unblock the Notifications












