ఓయూ స్టూడెంట్ లీడర్ బయోపిక్...జార్జ్ రెడ్డి ఉద్యమ నేపథ్యం నుంచి హత్య వరకు!
తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలయ్యాయి. మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటన్నింటికీ భిన్నంగా త్వరలో ఓ స్టూడెంట్ లీడర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాాజాగా ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
విద్యార్థి పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో ఒకప్పుడు విప్లవవాద ఉద్యమాలను ముందుండి నడిపించి, చివరకు అదే యూనివర్శిటీలో దారుణంగా హత్యచేయబడ్డ విద్యార్థినాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది.

జీవన్ రెడ్డి దర్శకత్వంలో...
గతంలో ‘దళం' అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ‘జార్జ్ రెడ్డి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్, 3 లైన్స్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, దాము రెడ్డి నిర్మించబోతున్నారు.

ఓయూలో జరిగిన విప్లవ స్టూడెంట్ మూమెంట్ ఆధారంగా...
1962 నుంచి 1972 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన స్టూడెంట్ ఉద్యమాల నేపథ్యంలో ‘జార్జ్ రెడ్డి' బయోపిక్ ఉంటుందని తెలుస్తోంది. మరాఠీ హిట్ మూవీ ‘సైరాట్' చిత్రానికి పని చేసిన సుధాకర్ రెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. జార్ రెడ్డి పాత్రలో వంగవీటి ఫేం సాండీ నటించబోతున్నారు.

ఎవరీ జార్జ్ రెడ్డి
ఎవరీ జార్జ్ రెడ్డి 1947, జనవరి 15న పాల్ఘాట్, కేరళలో చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథరెడ్డి, ట్రావెన్కూరు ప్రాంతానికి చెందిన లీలా వర్గీస్ దంపతులకు జన్మించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకుంటుండగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ దంపతుల ఐదుగురు సంతానంలో 4వ వాడు జార్జిరెడ్డి.

ఉస్మానియాలో
జార్జ్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం... చెన్నై, బెంగుళూరు, కాజీపేటలో సాగింది. తర్వాత వారి కుటుంబం హైదరాబాద్ షిప్ట్ అయింది. ఇక్కడి సెయింట్ పాల్స్ పాఠశాలలో 10వ తరగతి పూర్తయిన తర్వాత నిజాం కళాశాలలో పీయూసీ పూర్తి చేశాడు. 1964లో బిఎస్సీ చేసేందుకు మొదటిసంవత్సరం ఉస్మానియాలో చేరాడు. అయితే 2, 3 సంవత్సరాలు నిజాం కళాశాలలో పూర్తి చేశాడు. తర్వాత ఉస్మానియా నుంచి భౌతిక శాస్త్రంలో పీహెచ్డి పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు.

విద్యార్థి ఉద్యమాల వైపు..
ఉస్మానియాలో ఉన్న సమయంలోనే ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు జార్జ్ రెడ్డి. అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పి.డి.యస్.యు) స్థాపించారు. పి.డి.యస్.యు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) విద్యార్థి విభాగం.

దారుణ హత్య
1972 జూలై 14 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జిపై 30 మందికి పైగా దుండగలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై దాడిచేసి కత్తులతో పొడిచి చంపేశారు. జార్డ్ రెడ్డి బయోపిక్లో ఈ విషయాలన్నీ ఉంటాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











