Ghantasala Ratnakumar no more: గుండెపోటుతో కన్నుమూత.. షాక్లో సినీ పరిశ్రమ
ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు, డబ్బింగ్ ఆర్టిస్టు, గాయకుడు ఘంటసాల రత్నకుమార్ ఇకలేరు. కొద్దికాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన జూన్ 9 అర్ధరాత్రి చెన్నైలోని కావేరి హాస్పిటల్లో కన్నుమూశారు. రత్నకుమార్ మరణంతో దక్షిణాది సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు. ఘంటసాల రత్నకుమార్ గురించి మరింత వివరాల్లోకి వెళితే...

40 ఏళ్లపాటు డబ్బింగ్ రంగంలో
గత నాలుగు దశాబ్దాల్లో రత్నకుమార్ 1500 చిత్రాలకుపైగా డబ్బింగ్ చెప్పారు. తెలుగు, తమిళం, మలయాలళం హిందీ, సంసృత భాషల్లో రూపొందిన చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. దాదాపు 15000 తమిళ, తెలుగు సీరియల్స్కు చెందిన ఎపిసోడ్కు డబ్బింగ్ చెప్పిన ఘనతను సొంతం చేసుకొన్నారు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో ఘనతలను ఘంటసాల రత్నకుమార్ సొంతం చేసుకొన్నారు. దాదాపు 8 గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించారు.అమేజింగ్ బుక్ ఆఫ్ రికార్డ్సు, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించారు.అయితే 12 గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి సరికొత్త రికార్డును సాధించాలనే ప్రయత్నంలో ఉన్నారు. అది తీరకుండానే ఆయన మరణించడం విషాదంగా మారింది. అలాగే దాదాపు 50 డాక్యుమెంటరీలకు డబ్బింగ్ చెప్పారు.

గుండెపోటుతో మృతి...
ఘంటసాల రత్నకుమార్కు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కరోనావైరస్ బారిన పడిన ఆయనకు ఇటీవలే నెగిటివ్ వచ్చింది. ఇక కోలుకొంటున్నారని అందరూ భావించారు. ఆయనను డిశ్చార్జి చేయాలని కూడా వైద్యుల భావించారు. కానీ అందర్ని తీవ్ర విషాదంలోకి నెడుతూ ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారు అని వైద్యులు వెల్లడించారు.

గాయకుడిగా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా
తండ్రి ఘంటసాల వెంకటేశ్వరరావు బాటలోనే నడిచి గాయకుడు కావాలని కోరుకొన్నారు. కానీ తమిళ చిత్రం కంచి కామాక్షి అనే చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేయగా ఆ చిత్రానికి ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. ఆ చిత్రం 100 రోజులు ఆడటంతో డబ్బింగ్ ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. దాంతో ఆయన డబ్బింగ్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు.

అవార్డులు, రివార్డులు, బిరుదులు
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా పలు అవార్డులను, రివార్డులను ఘంటసాల రత్నకుమార్ అందుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను నంది అవార్డుతో సత్కరించింది. సౌత్ ఇండియణ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కలై సెల్వం అనే బిరుదును ప్రదానం చేసింది. అలాగే సౌత్ ఇండియన్ సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ ఆయనను కురల్ సెల్వం అనే బిరుదుతో సత్కరింింది. మద్రాస్ తెలుగు అసోసియేషన్ ఆయనకు ఉగాది పురస్కారాన్ని ఇచ్చింది.


Click it and Unblock the Notifications











