20 నుంచి 'గోవా చిత్రోత్సవం':పూర్తి వివరాలు
ముంబయి: భారతీయ సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోవాలో ఈ నెల 20 నుంచి 30 వరకు నిర్వహించనున్న అంతార్జాతీయ చిత్రోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీ జగత్తు అంతా గోవా వైపు పయనమైంది. ఈ సందర్భంగా 26 ఫీచర్ ఫిల్మ్లు, 56 డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తున్నట్లు ఫెస్టివల్ డైరెక్టర్ శంకర్ మోహన్ వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతీయ ఇతివృత్తాలతో నిర్మించిన చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు.
తొలి ప్రదర్శనగా 2011లో జాతీయ అవార్డును అందుకున్న కె.పి.సువిరణ్ బ్యారీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు చెప్పారు. భారతీయ ఆచార వ్యవహారాలు, వివాహ వ్యవస్థ, విడాకులు, పునర్ వివాహాలు జరుగుతున్న కర్ణాటకలోని బ్యారీ వర్గంపై ఈ చిత్రాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. గోవాలో జరగనున్న ఐఎఫ్ఎఫ్ఐ చిత్రోత్సవాలు భారతీయ చలన చిత్ర రంగం అభినందించే విధంగా జరుగుతాయని చెప్పారు. చిత్రోత్సవంలో సినీ రంగ ప్రముఖులను కలుసుకోవడం, కొత్తవారిని స్నేహితులుగా మార్చుకోవడానికి ఇదో వేదికగా మారనుంది.
26/11 ముంబయి ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఒక జంట ముంబయికి రావడం వారు పడినపాట్లను అస్సామీ భాషలో 'బాందూన్' పేరుతో నిర్మించిన చిత్రాన్ని డైరెక్టర్ బౌరా ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా చలన చిత్ర పరిశ్రమతో నిత్య సంబంధాలున్న పోలెండ్కు చెందిన ఫ్రిజీస్టోఫ్ జనుస్సీ కూడా హాజరువుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించనున్నామన్నారు.
పాండిచేరిలో నిర్మించిన 'లైఫ్ ఆఫ్ పై' చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తారు. భారతీయ చలన చిత్ర రంగాన్ని ఒక కుటుంబ వ్యవస్థగా తీసుకొచ్చే ఉద్దేశంతోనే తాము ఉత్సవాలను చేపట్టినట్లు చెప్పారు. అంతేకాకుండా నేటి సినిమాలలో ఉపయోగిస్తున్న టెక్నాలజీపై కూడా పలు సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సినిమాల్లో 50 శాతం టెక్నాలజీ, మిగతా 50 శాతం సృజనాత్మకతను ఉపయోగిస్తున్నట్లు వివరించారు.


Click it and Unblock the Notifications











