అదిరింది: ‘గోపాల గోపాల’ న్యూ ఇయర్ పోస్టర్
హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా ‘గోపాల గోపాల' కొత్త పోస్టర్ విడుదల చేసారు. పంచకళ్యాణి రథంపై కృష్ణార్జులను తలపించేలా ఉన్న ఈ పోస్టర్ అదిరిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఎన్ఆర్ఏ బేసిస్ కింద రూ. 13.4 కోట్లకు ఆయన ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్బాబు, శరత్మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి(వెంకటేష్) దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్, పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది.

వివాదం..
సినిమా రంగాన్ని ఉపయోగించుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఒక పథకం ప్రకారం జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర. సినిమాటోగ్రఫీ చట్టంలోని లొసుగులను, సెన్సార్ బోర్డులో తిష్టవేసిన అవినీతిని ఆసరాగా చేసుకుని, స్వేచ్ఛ పేరుతో, వినోదం పేరుతో హిందువుల దేవ దేవతలను, భారతీయ విలువలను దెబ్బతీసే విధంగా సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలను వెంటనే నిషేదించాలని, వాటి ప్రదర్శనకు అనుమతులు ఇవ్వకూడదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది.
దీనిపై వారు మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రం ప్రోమో ఇటీవల టీవీ చానల్స్ లో ప్రసారం అయింది. శ్రీకృష్ణుని వేషధారణతో అసభ్యంగా నాట్యాలు చేస్తూ, వినోదం కోసం దేవుళ్ల వేషధారణ వేయడంపై ఈ రోజు సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసాం. ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని, ఈ చిత్రం ప్రివ్యూ కూడా వెంటనే నిషేదించాలని డిమాండ్ చేస్తూ లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది' అని తెలిపారు.
ఫిర్యాదుపై స్పందించిన రీజనల్ అధికారి, ఈ చిత్ర ప్రమోకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, వెంటనే క్రమినల్ కేసులు నమోదు చేయడానికి పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేస్తానని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సన్నివేశాలు ఉంటే ఈ చిత్ర విడుదల ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని...భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు తెలిపారు.
సినిమా రంగం హిందువుల మనోభావాలు గౌరవించేలా ప్రవర్తించాలి. లేకుంటే తగిన గుణపాఠం చెప్పాల్సివస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంటూ....భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు, కార్యదర్శి రావినూతల శశిధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











